కడియం కావ్య 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది : కడియం శ్రీహరి

కడియం కావ్య  2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది :  కడియం శ్రీహరి

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లోక్ సభ సభ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీతో గెలుస్తుందని  స్టేషన్ ఘన్ పూర్  కాంగ్రెస్ ఎమ్మెల్యే  కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్క దారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు.  సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను అడ్డుకోవడానికి  కాంగ్రెస్  యువత సైనికులుగా పని చేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ అనుబంధ NSUI వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కడియం పాల్గొన్నారు.  

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు  కడియం శ్రీహరి.  ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని  మోడీ పదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.  ఉన్న ఉద్యోగాలు తొలిగిపోయేలా మోదీ  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని  మండిపడ్డారు.  ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్మేయడం అంటే దొడ్డి దారిన రిజర్వేషన్లు తొలగించడమేనన్నారు.  

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు కడియం. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని..  2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తామన్నారు.  విభజన హామీలను నెరవేర్చని అసమర్థ  ప్రభుత్వం బీజేపీ అని విమర్శి్ంచారు.   బీజేపీ పాలనలో మహిళలకు , అణగారిన వర్గాలకు రక్షణ లేదన్నారు. దేశం బాగుండాలన్నా... అన్ని వర్గాలు స్వేచ్చగా ఉండాలంటే  కేంద్రంలో  కాంగ్రెస్ అధికారం లోకి రావాలని పిలుపునిచ్చారు.