మాలీవుడ్లో పృథ్వీరాజ్ సుకుమారన్.. హీరోగా, దర్శకుడిగా సినీ రంగంలో బిజీగా కొనసాగుతున్నారు. మాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఈ నటుడి సినిమా కోసం అభిమానులు వేచి చూస్తుంటారు. ఇటీవలే ఆయన నటించిన ‘జనగణమన’ సంచలన విజయం సాధించింది. ఇతను నటించిన సినిమాలు వివిధ భాషల్లో రీమేక్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ.. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’గా రీమేక్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా మార్కెట్ ను సృష్టించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా.. పృథ్వీ లేటెస్ట్ మూవీ ‘కడువా’ను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. తాజాగా శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘కడువా’ చిత్రం తెలుగు టీజర్ ను విడుదల చేశారు.
ఎవడ్రా మీ ఊళ్లో కురియన్ అంటా.. అనే స్టార్టింగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. వాడెవడో కొత్తోడై ఉంటాడు సర్.. ఊళ్లో అతనికి ఇంకో పేరు ఉంది..కురువశ్చన్.. కడువా కురియన్ కురువశ్చన్`..అంటూ డైలాగ్స్ తో టీజర్ మొదలైంది. హీరో పృథిరాజ్ సుకుమారన్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనొక చిరుత సార్.. వేట కోసం కాచుకున్న చిరుత అంటూ పృథ్వీరాజ్ ను పరిచయం చేశారు. తెల్ల లుంగీ, అదే కలర్ షర్ట్ ధరించి. చేతికి చిరుత సింబల్ తో ఉన్న ఉంగరం ధరించి.. పోలీసులను చితకబాదుతున్న దృశ్యాలు మూవీ అంచనాలను అమాంతం పెంచేశాయి. హీరోపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
చిరుతలా పృథ్వీరాజ్ పాత్రను చూపించడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగా ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. వివేక్ ఓబెరాయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్తో కలిసి పృథ్వీరాజ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. పాన్ ఇండియా వైడ్ గా మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.