కైకాల సినిమాలోకి ఎలా ఎంటరయ్యాడంటే.?

కైకాల సినిమాలోకి ఎలా ఎంటరయ్యాడంటే.?

దిగ్గజ నటుడు దివికెగిశారు. పాత్రేదైనా పరకాయ ప్రవేశం చేసి నటించే కైకాల సత్యనారాయణ ఇవాళ కన్నుమూశారు.  పౌరాణికం.. సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలకు తన నటనతో వన్నె తెచ్చారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను పోషించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కైకాలే. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కైకాల యముడిగా సుపరిచితులు. 

కైకాల జననం..

కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో  1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు.  గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైన కైకాల..1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అయితే తన మనవళ్లలో ఒకరిని నటవారసుడిగా చూడాలనేది కైకాల కోరిక. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల..ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు. 

ఎన్టీఆర్కు డూప్..

ఇంటర్ రెండో సంవత్సరంలో నాటకరంగంలో  ప్రవేశించిన కైకాల..నాటకరంగ అనుభవంతో సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లారు. మొదటగా కైకాల సత్యనారాయణను డిఎల్ నారాయణ నటుడిగా గుర్తించారు. తొలి సినిమాతోనే కథానాయకుడి అవకాశాన్ని అందుకున్నారు. సిపాయి కూతురు చిత్రంతో కథానాయకుడిగా తెరకు పరిచయమైన కైకాలకు ఎన్టీఆర్ పోలికలు కలిసొచ్చాయి. తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ తో కలిసి నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో కనకదుర్గ పూజ మహిమ చిత్రంలో తొలిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో  కైకాల సినీ జీవితం మలుపుతిరిగింది. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్తో పోరాట సన్నివేశాల్లో పోటాపోటీగా నటించి మెప్పించారు. యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించారు. సాంఘిక చిత్రాల్లో రౌడీ, తండ్రి, తాత పాత్రల్లో నటించారు. 

223 చిత్రాలు వంద రోజులు..

కైకాల తన సినీ జీవితంలో 777 చిత్రాల్లో నటించారు. సిపాయి కూతురు సినిమాతో కైకాల సత్యనారాయణ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.  పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించారు. మొత్తంగా 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. కైకాల నటించిన223 చిత్రాలు 100 రోజులు ఆడాయి. 59 చిత్రాలు అర్ధశతదినోత్సవాలను జరుపుకున్నాయి. 10 సినిమాలు ఏకంగా ఏడాది కాలం పాటు ఆడటం విశేషం. చివరగా కైకాల సత్యనారాయణ మహర్షి సినిమాలో నటించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల సత్యనారాయణ ..కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు. 1994లో బంగారు కుటుంబం చిత్రానికి నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2011లో రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. కైకాలకు బాగా నచ్చిన సంభాషణ: నీవా పాండవ పత్ని. సినిమాలతో పాటు..రాజకీయాల్లోనూ కైకాల రాణించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ..తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.