
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాల్లో చెరువులు నిండాయని, ఇక వద్దన్నా పైనుంచి నీళ్లు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అందిస్తున్న ఉచిత కరెంట్, సాగునీటి సౌకర్యంతో చాలా మంది యువకులు కూడా ఉద్యోగాలు మానేసి వ్యవసాయం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నారు. సెర్ప్ సహకారంతో మహిళా రైతులు ఏర్పాటు చేసుకున్న బేనిషాన్ ఫార్మర్ ప్రొడ్యుసర్ కంపెనీని, సదరం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను సోమవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సమాజంలో కల్తీ లేని వస్తువు కనిపించడం లేదని, చివరికి మటన్, చికెన్ కూడా కల్తీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల్లో కల్తీ నివారణ కోసమే రైతులతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిపారు.
సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం
సదరం క్యాంపులకు దివ్యాంగులు పోటెత్తుతుండడంతో డాక్టర్లు సరిగ్గా అసెస్ చేయలేకపోతున్నారని, అందుకే విడతలవారీగా పరీక్షించేందుకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సిస్టంను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కొత్త విధానంతో ఒకే రోజు టెస్టింగ్ చేయడంతోపాటు సర్టిఫికెట్ జారీ చేస్తారని చెప్పారు. జనవరి ఒకటో తేదీ నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
రైతులతో కంపెనీ శుభసూచకం: నిరంజన్రెడ్డి
రైతులతో కంపెనీ స్థాపించి ముందుకెళ్లడం శుభసూచకమని, బేనిషాన్ కంపెనీ కూరగాయలతోపాటు ఆర్గానిక్ పంటలను, పాలు, మాంసం ఉత్పత్తులను సేకరించి మార్కెటింగ్ చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రైవేట్ రంగంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం 50 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్––1, లింక్-–-2 పనుల వ్యయాన్ని రాష్ట్ర సర్కారు ఏకంగా రూ.3,461 కోట్ల మేర అదనంగా పెంచుతోంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, లింక్—2లోని ప్యాకేజీ-7, ప్యాకేజీ—8 పనులకు గతంలోనే రూ. 1,890 కోట్ల మేర వ్యయం పెంచారు. తాజాగా మళ్లీ పెంచుతూ రివైజ్డ్ ఎస్టిమేట్స్ సిద్ధం చేశారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కలిపితే మొత్తంగా ఈ పనుల ఖర్చు అదనంగా రూ.5,351 కోట్లు పెరుగుతోంది. సిమెంట్, స్టీల్, డీజిల్ రేట్లు పెరగడం, అదనంగా భూమిని సేకరించాల్సి రావడమే దీనికి కారణమని ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ పెంపునకు సర్కారు ఆమోదం లాంఛనమేనని అంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద..
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజీ అయిన మేడిగడ్డ నిర్మాణానికి ప్రభుత్వం తొలుత రూ.2,591 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థ 2.7 శాతం ఎక్సెస్కు టెండర్ వేసి పనులు దక్కించుకుంది. తర్వాత సర్కారు దీని నిర్మాణ వ్యయాన్ని రూ.3,260 కోట్లకు పెంచింది. తాజాగా మరోసారి వివిధ పనుల వ్యయాన్ని పెంచారు. వ్యాప్కోస్ రూపొందించిన బ్యారేజీ ఎస్టిమేషన్లో కాఫర్ డ్యాం నిర్మాణానికి రూ.11.64 కోట్లు ప్రతిపాదించగా.. రూ.69.42 కోట్లకు పెరిగింది. బ్యారేజీ నిర్మాణ సివిల్ వర్క్ల వ్యయం రూ.19.28 కోట్ల నుంచి రూ.66.46 కోట్లకు.. మట్టి తొలగింపు, త్రీడీ మోడల్ స్టడీస్ ఇతరత్రా వ్యయం రూ.85.74 కోట్ల నుంచి రూ.120.12 కోట్లకు పెరిగింది. రాఫ్ట్, రివర్ బెడ్ స్ట్రాటా, సిమెంట్ బ్రిక్స్ ధరల పెంపు, నిర్మాణ ప్రాంతంలో వస్తున్న నీటి ఊట తొలగింపు తదితర వ్యయాలు భారీగా పెంచారు. గేట్ల బిగింపు, గైడ్ బండ్స్, ఫ్లడ్ బ్యాంక్స్, డైవర్షన్ చానల్, అప్రోచ్ రోడ్ అన్ని కలిపి బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ.4,583 కోట్లకు పెరిగిందని తాజా అంచనాల్లో పేర్కొన్నారు. అంటే తొలి అంచనాతో పోలిస్తే బ్యారేజీ నిర్మాణ వ్యయం అదనంగా రూ.1,992 కోట్ల పెరిగింది. పనులు పూర్తయ్యే సరికి వ్యయం డబుల్ కావడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నారం బ్యారేజీ పనుల్లో..
కాళేశ్వరం ప్రాజెక్టులో రెండో బ్యారేజీ అన్నారం నిర్మాణానికి మొదట రూ.1,785 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. పనులు జరుగుతున్న క్రమంలోనే గతేడాది దీనిని రూ.2,456 కోట్లకు పెంచారు. ఇప్పుడు రూ.2,795 కోట్లకు పెంచుతున్నట్టుగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ సిద్ధం చేశారు. సిమెంట్, ఇసుక, లేబర్ చార్జీలు, జీఐ పైపులు, ఇతర మెటీరియల్ ఖర్చులు పెరగడంతో ఖర్చు పెరిగినట్టుగా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంటే బ్యారేజీ నిర్మాణ వ్యయం రూ.1,010 కోట్లు అదనంగా పెరిగింది.
ప్యాకేజీ-7లో..
ప్రాజెక్టు లింక్––2లోని నందిమేడారం పంపుహౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని నందిమేడారం రిజర్వాయర్, అప్రోచ్ చానెల్ మీదుగా ట్విన్ టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ––8కు లింక్ చేస్తారు. ఈ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ మొదట రూ.1,502 కోట్లకు దక్కించుకోగా తర్వాత రూ.1,541 కోట్లకు పెంచారు. తాజాగా రూ.2,030 కోట్లకు అంచనాలను సవరించారు. మేడారం రిజర్వాయర్ నిర్మాణంలో అదనపు పనులు, టన్నెల్ తవ్వకంలో ఎదురైన సమస్యలతో కంట్రోల్ బ్లాస్టింగ్, సిమెంట్ ధరల పెంపు, టెక్నికల్ సపోర్ట్ ఇతరత్రా పనుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగినట్టుగా పేర్కొన్నారు. ఈ ప్యాకేజీ వ్యయం అదనంగా రూ.528 కోట్లు పెరిగింది.
ప్యాకేజీ-8లో..
కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద (139 మెగావాట్లు) మోటార్లు ఏర్పాటు చేసిన లక్ష్మీపూర్ పంపుహౌస్, దానికి నీటిని చేర్చే ట్విన్ టన్నెళ్లు, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాల వ్యయం భారీగా పెరిగింది. రూ.5,166 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ పనులు చేపట్టగా తర్వాత రూ.5,677 కోట్లకు పెరిగింది. తాజాగా దీనిని రూ. 6,987 కోట్లకు సవరించి రివైజ్డ్ ఎస్టిమేట్లు రూపొందించారు. పంపుహౌస్, గ్రావిటీ కాల్వల కోసం అదనంగా 600 ఎకరాల భూమి సేకరించాల్సి రావడం, టన్నెల్ తవ్వకంలో ఎదురైన సమస్యలు, గెస్ట్ హౌస్ల నిర్మాణం, ఇతర సామగ్రి ధరల పెంపుతో ఇక్కడ నిర్మాణ వ్యయం పెరిగినట్టుగా చూపారు. మొత్తంగా ఈ ప్యాకేజీ వ్యయం ఏకంగా రూ,1,821 కోట్లు అదనంగా పెరిగింది.