జూలై నెలలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్

జూలై నెలలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్
  • జులై రెండో వారంలో సర్కారుకు అందే అవకాశం 
  • ప్రాజెక్టుపై క్యాబినెట్ నిర్ణయాలు సిద్ధం చేస్తున్న అధికారులు 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు కసరత్తు చేస్తున్నది. జులై రెండో వారం నాటికి నివేదికను సర్కారుకు ఇవ్వాలని యోచిస్తున్నది. విచారణలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సహా116 మందిని కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటికే అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా రిపోర్ట్ ను ఒక రూపానికి తీసుకొచ్చిన కమిషన్.. అందులో ప్రజా ప్రతినిధుల స్టేట్మెంట్లనూ పొందుపరుస్తున్నది. ఈ నెల 6, 9, 11వ తేదీల్లో ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేసీఆర్ ను కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలనూ క్యాబినెట్ లో చర్చించారని, క్యాబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని విచారణలో వీరు ముగ్గురూ చెప్పారు. 

దీంతో క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాల వివరాలను ఇవ్వాలని సర్కారును కమిషన్ కోరింది. అధికారులు ఆ వివరాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 30లోపు ఆ వివరాలను సర్కారు అందించనున్నట్టు తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బ్యారేజీల లొకేషన్ల మార్పు, ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలు, కార్పొరేషన్ ఏర్పాటు, కాంట్రాక్టు వివరాలు తదితర అంశాలన్నింటిపై క్యాబినెట్ నిర్ణయాలను రెడీ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు అందగానే వాటి ఆధారంగా రిపోర్ట్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.