
కాళేశ్వరం... సరస్వతీ పుష్కరా లకు జనం పోటెత్తుతున్నారు. మద్దులపల్లి -కాళేశ్వరం మధ్యలో 8 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతీ పుష్కరాలకు సోమవారం (మే 26) చివరి రోజు కావడంతో భక్తులు బారులు తీరుతున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరు కోవడంతో భక్తుల రద్దీ మరింత పెరింది.
కాళేశ్వరం పుష్కరానికి వెళ్లిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ను పునరుద్ధరిస్తున్నారు.
కాళేశ్వరానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు.
ఆదివారం ( మే 25) .. సోమవారం పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భక్తులకు తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చలివేంద్రాలు ఏర్పాటుచేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా కాళేశ్వరంలోనే విడిది చేసి వసతులు, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. సరస్వతీ పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు కాళేశ్వర క్షేత్రం మొత్తాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించడం కోసం అధికారులు హెలీకాప్టర్ జాయ్ రైడ్ను యాత్రాదాం.ఓఆర్జి ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
దూర ప్రాంతాల నుంచి భక్తుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా పుష్కర ఘాట్ లకు దగ్గర్లోనే టెంట్లు ఏర్పాటు చేశారు. ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డార్మెటరీ సదుపాయం కల్పించారు. అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారంతో సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి.వీకెండ్ కావడం.. పుష్కరాల చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి పెరుగుతోంది. త్రివేణీ సంగమ పరిసరాలు ఇప్పటికే జనసంద్రంగా మారాయి. దీంతో ఘాట్ పరిసరాల్లో అదనంగా వాహనపార్కింగ్ స్థలాలను అధికారులు సిద్ధం చేశారు.