జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి త్రివేణి సంగమం వద్ద సరస్వతి అంత్య పుష్కరాల పవిత్ర స్నానాల కార్యక్రమాన్ని గురువారం( మే 21) తెల్లవారుజామున 5.43 నిమిషాలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం చేసి సరస్వతి అంత్యపుష్కరాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. 12 రోజుల పాటు నదీ తీరంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో ఏ రోజు ఎలాంటి పూజ జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. . .
తెలంగాణలోని కాళేశ్వరం నదీతీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, భూగర్భ సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమ తీరం"దగ్గర ... ఈ పుష్కరాలు జరిగే 12 రోజులు ( మే 21 నుంచి జూన్ 1 వరకు) ప్రత్యేక పూజలు, హోమాలు... సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సరస్వతి అంత్యక్రియలు మే 21న మహా గణపతి హోమం నుంచి ప్రారంభం కాగా... జూన్ 1న లఘు చండి మహా పూర్ణాహుతితో ముగుస్తాయని పండితులు తెలిపారు.
12 రోజుల పుష్కర పూజల వివరాలు:
- మే 21 గురువారం ( పంచమి ...పునర్వసు నక్షత్రం) : మహా గణపతి హోమం... సకల విఘ్న నివారణార్థం
- మే22 శుక్రవారం ( షష్టి .. పుష్యమి నక్షత్రం) : సుబ్రహ్మణ్య హోమం.. సంతాన ప్రాప్తి & రక్షణ
- మే23 శనివారం ( సప్తమి .. ఆశ్లేష నక్షత్రం) : హయగ్రీవ హోమం.. సకల విద్యలు సిద్దిస్తాయి.
- మే 24 ఆదివారం(అష్టమి.. మఖ నక్షత్రం) : నవగ్రహ హోమం... నవగ్రహాలు శుభదృష్టి కొరకు
- మే25 సోమవారం( నవమి.. పుబ్బ నక్షత్రం) : మహా మృత్యుంజయ హోమం..అపమృత్యు దోష నివారణ
- మే26 మంగళవారం ( దశమి.. ఉత్తర నక్షత్రం) : దుర్గా సూక్త హోమం... సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.
- మే27బుధవారం(ఏకాదశి .. హస్త నక్షత్రం):మహా సుదర్శన హోమం..నరఘోష,దృష్టి దోషం నుంచి విముక్తి
- మే28 గురువారం(ద్వాదశి.. చిత్త నక్షత్రం):మేధా దక్షిణామూర్తి హోమం...ఙ్ఞానం.. తెలివితేటలు అభివృద్ది.. అప్పుల నివారణకు
- మే29 శుక్రవారం(త్రయోదశి .. స్వాతి నక్షత్రం) : స్వయంవర పార్వతి హోమం.. వివాహంలో ఆటంకాలు తొలిగేందుకు
- మే30 శనివారం( చతుర్దశి ..విశాఖ నక్షత్రం):ధన్వంతరి హోమం... దీర్థకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
- మే31ఆదివారం ( పౌర్ణమి .. అనురాధ నక్షత్రం) : మహా రుద్ర హోమం..అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి
- జూన్ 01సోమవారం ( నిజ జ్యేష్టమాసం శుద్ద పాడ్యమి..జ్యేష్ఠ నక్షత్రం) : లఘు చండీ హోమం.. అన్ని రకాల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.
మహా హారతి, సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు
ప్రతి రోజు సాయంత్రం త్రివేణి సంగమ తీరంలో గంగా హారతి తరహాలో వేద మంత్రోచ్ఛారణలు, దీపాలు, గంటల నాదాల మధ్య మహా హారతి నిర్వహిస్తారు. కాశీ నుంచి వేద పండితులు ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పుష్కరాల్లో భాగంగా ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ నదిలో పుణ్య స్నానం ఆచరించనున్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది.
ALSO READ : కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు...
కాళేశ్వరంలో గోదావరిలో అంతర్వాహినిగా కలిసే స్థానంలో పవిత్ర స్నానాలు వేదాలు మరియు పురాణాల్లో సరస్వతి నదిని అత్యంత పవిత్రమైనదిగా వర్ణించారు. హిమాలయాల నుంచి ఉద్భవించి భూగర్భంలో ప్రయాణించే ఈ నది జ్ఞానప్రదాయినిగా చెప్తారు. కాళేశ్వరంలో గోదావరిలో అంతర్వాహినిగా కలిసే స్థానం కారణంగా ఇక్కడి పుష్కరాలు విశేష ఫలితాలు ఇస్తాయని భక్తుల విశ్వాసం. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేస్తే పాపాలు తొలగి, విద్యాభివృద్ధి, జ్ఞానం, మానసిక శాంతి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
