గజ్వేల్ ​చుట్టూ కామారెడ్డి పాలిటిక్స్​

గజ్వేల్ ​చుట్టూ  కామారెడ్డి పాలిటిక్స్​
  • అక్కడి ప్రజలు అరిగోస పడుతున్నారంటున్న బీజేపీ లీడర్లు
  • ఓటమి భయంతోనే కామారెడ్డికి సీఎం వస్తున్నారంటూ కాంగ్రెస్​కామెంట్స్​
  • గజ్వేల్​లో జరిగిన అభివృద్ధి చూడండంటూ బీఆర్ఎస్​ సోషల్​మీడియాలో పోస్ట్​లు

కామారెడ్డి, వెలుగు: ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ గజ్వేల్​తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తానని ప్రకటించడంతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది. గజ్వేల్​లో చేసిన అభివృద్ధి శూన్యమంటూ ప్రతిపక్షాలు తమ విమర్శనాస్త్రాలకు ఎక్కుపెట్టాయి. బీజేపీ ఓ అడుగు ముందుకేసి ఈ నెల 1న చలో గజ్వేల్ ​ప్రోగ్రామ్​కు నిర్వహించేందుకు ప్రయత్నించింది. అభివృద్ధి మాటున అధికార బీఆర్ఎస్ ​లీడర్లు గజ్వేల్ జరిగిన విధ్వంసాలు, ప్రజల ఇబ్బందులు, మల్లన్నసాగర్ ​బాధితుల కష్టాలు చూపెడతామని చెప్పింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రోగ్రామ్​ జరగకపోయినా, స్థానికంగా గజ్వేల్​ అభివృద్ధిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. గడిచిన పదేండ్లలో భూకబ్జాలు, పేద ప్రజలకు వేధింపులే తప్పా, అక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదంటూ బీజేపీ లీడర్లు సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

స్టేట్​ లీడర్లతో చలో గజ్వేల్​

గజ్వేల్​కు వెళ్లనీయకుండా బీజేపీ శ్రేణులను అరెస్ట్​చేయడంపై ఆ పార్టీ నేతలు ఫైరయ్యారు. పార్టీ అధిష్టానం కామారెడ్డి లీడర్లను హైదరాబాద్​కు పిలుపించుకొని మాట్లాడారు. పార్టీ ప్రెసిడెంట్ కిషన్​రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు, నేషనల్ వైస్​ప్రెసిడెంట్​డీకే అరుణ తదితరులు చలో గజ్వేల్ ​ప్రోగ్రామ్​ను అడ్డుకోవడంపై పోలీసులపై ఫైరయ్యారు. స్టేట్​ముఖ్యనేతలమంతా కలిసి త్వరలోనే చలో గజ్వేల్​ప్రోగ్రామ్​ నిర్వహిస్తామని, అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటో నిగ్గు తేల్చుతామని ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రకటించారు. దీంతో ఈ టాపిక్​రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్​ ప్రచారం

గజ్వేల్​లో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్​ పెట్టేందుకు బీఆర్ఎస్​ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా వేదికగా అక్కడ జరిగిన అభివృద్ధిపై ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కామారెడ్డి నియోజకవర్గంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్​ చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయంటూ పేర్కొంటున్నారు. ఇక్కడి బీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు వాటిని వాట్సాప్​ గ్రూపుల్లో షేర్​ చేస్తున్నారు.

కాంగ్రెస్​ పార్టీ సైతం..

గజ్వేల్​లో  కేసీఆర్​ ఓడిపోతారనే భయంతోనే  కామారెడ్డిలో పోటీకి వస్తున్నారంటూ కాంగ్రెస్​ విమర్శలు చేస్తోంది. ఇటీవల స్థానికంగా జరిగిన పార్టీ మీటింగ్​కు గజ్వేల్​ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని తీసుకొచ్చి, అక్కడ జరిగిన అభివృద్ధిపై మాట్లాడించారు. అక్కడ కేసీఆర్ ​చేసిన అభివృద్ధి ఏం లేదంటూ ఆయన విమర్శించారు. తక్కువ రేటుకు భూములు కొని, ఎక్కువ రేటుకు అమ్ముకోవడమే బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.