తెలంగాణ జాతిపితగా గద్దర్ పేరు ప్రకటించాలని సామాజికి వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ గద్దర్ గళం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు, మేథావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దర్ ను ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా గుర్తించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది.
అనంతరం మాట్లాడిన కంచె ఐలయ్య.. గద్దర్ ను జాతిపితగా గుర్తించాలని ముందు నుంచి ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించడం వెనుక చాలా చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ మళ్లీ తెరమీదకు తెస్తున్నాడనే ఆయనపై కాల్పులు జరిపారని చెప్పారు ఐలయ్య. కడుపులో బుల్లెట్లు పెట్టుకుని గద్దర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిరిగే పాటలు రాసింది, పాడింది గద్దరేనని చెప్పారు.
కొందరు నేతలు తెలంగాణ జాతిపితగా తామేనని ప్రకటించుకుంటున్నారని విమర్శించారు ఐలయ్య. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గద్దర పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పదవులు ఆశించకుండా అధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు. గద్దర్ పక్షాలు ఉన్నాయని.. ఒక్కటి విప్లవపక్షం..రెండోది తెలంగాణ ఉద్యమ పక్షం అని చెప్పారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణగా గద్దర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు ఐలయ్య.
