Kannappa Notice: రివ్యూలు రాసేటోళ్లకు, చెప్పేటోళ్లకు ‘కన్నప్ప‘ టీం స్ట్రాంగ్ వార్నింగ్

Kannappa Notice: రివ్యూలు రాసేటోళ్లకు, చెప్పేటోళ్లకు ‘కన్నప్ప‘ టీం స్ట్రాంగ్ వార్నింగ్

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). ఈ మూవీ జూన్ 27, 2025 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు సుమారు రూ.200 కోట్ల బడ్జెట్తో కన్నప్ప తెరకెక్కించారు. 

కన్నప్ప మూవీ రిలీజ్కు ఇంకా 2 రోజులే ఉంది. ఈ క్రమంలో కన్నప్ప మేకర్స్.. స్ట్రాంగ్ వార్నింగ్ నోట్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలోని క్రిటిక్స్, యూట్యూబర్స్.. ఇలా ఎవరైనా సరే.. కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌ రివ్యూస్ ఇచ్చినా.. సినిమా నటులపై ఇబ్బందికర ట్రోల్స్ చేసిన చట్టపరమైన చర్యలుతీసుకుంటామని నోట్ ద్వారా చెప్పుకొచ్చారు.

ఢిల్లీ హైకోర్టు గతంలోనే మోహన్ బాబు, మంచు విష్ణుల ప్రైవసీ హక్కుల్ని రక్షిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్లు చేయడం, ఫేక్ కంటెంట్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా సినిమాను పర్మిషన్ లేకుండా ప్రదర్శించిన, స్ట్రీమ్ చేసిన, లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలని ప్రయత్నించిన వారిపై సివిల్, క్రిమినల్, సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని మేకర్స్ హెచ్చరించారు.

" కన్నప్ప మూవీ అపారమైన కళాత్మక అంకితభావంతో పాటు ఎంతోమంది అవిశ్రాంత కృషితో తెరకెక్కింది. ముఖ్యంగా వందలకోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కన్నప్ప మూవీ సృజనాత్మక సంస్థ యొక్క ఫలితమని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ సినిమాను బాధ్యతాయుతంగా ప్రజలతో మమేకం అయ్యేలా తీసుకొస్తున్నాం. అందువల్ల విమర్శకులందరూ ముందుగా సినిమాను చూసి, దాని సారాన్ని అభినందించి, ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుని రివ్యూలు అందించాలి. అంతేగానీ, ముందస్తుగా పక్షపాతాలను లేదా ప్రతీకారపూరిత వ్యాఖ్యానాలకు లొంగిపోకుండా జాగ్రత్తగా ఉండండి. మీరు బాధ్యతాయుతంగా రివ్యూలు ఇవ్వాలని మేము గౌరవంగా అభ్యర్థిస్తున్నాము" అని కన్నప్ప టీమ్ నోట్ లో వెల్లడించింది.

అయితే, ఈ సినిమా నిర్మాణ సమయంలో గతంలో ఎదురైన అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో!