ఓపెనింగ్​కు సిద్ధమైన క‌‌రీంన‌‌గ‌‌ర్ తీగ‌‌ల వంతెన‌‌

ఓపెనింగ్​కు సిద్ధమైన క‌‌రీంన‌‌గ‌‌ర్ తీగ‌‌ల వంతెన‌‌
  • సౌత్ ఇండియాలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి
  • రూ.224 కోట్లతో నిర్మాణం.. తుది దశకు పనులు
  • త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు
  • ఆర్అండ్​బీ నిర్మించిన మొదటి తీగల వంతెన

హైద‌‌రాబాద్‌‌, వెలుగు: కరీంనగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి త్వరలో ఓపెన్​కానుంది. త్వరలో బ్రిడ్జిని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జిపై లోడ్ టెస్టింగ్ ​విజయవంతంగా పూర్తయింది. బ్రిడ్జిని కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఆర్అండ్​బీ  అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న తొలి కేబుల్ బ్రిడ్జ్ ఇదే కావడం విశేషం. వెయ్యి టన్నుల సామర్థ్యం గల ఈ కేబుల్ బ్రిడ్జిని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. 
ట్రాఫిక్​ సమస్యలకు చెక్‌..
2014 తరువాత సీఎం హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాద్, వరంగల్ వెళ్లాల్సిన వాహనాలు అలుగునూర్ బ్రిడ్జీ పై నుంచి వెళ్లాల్సి వస్తుండటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే.. వరంగల్ కు ప్రత్యేక రోడ్డు నిర్మించడమే మంచిదని ప్రభుత్వం భావించింది. కరీంనగర్- సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ రోడ్డుపై రూ.224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీ  వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ప్రస్తుతం కరీంనగర్-– వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడంతో పాటు ఇది టూరిజం హబ్ గా మారనుంది. 
అప్రోచ్ రోడ్లు పూర్తయితే..
 కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు... కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందు కోసం రూ. 34 కోట్లతో విశాలమైన రోడ్లను నిర్మించనున్నారు. 4.7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు, సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జీ వరకు రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తయితే బ్రిడ్జ్ పైకి వాహనాలను అనుమతించనున్నారు. రూ.8 కోట్లతో బ్రిడ్జ్ పై రంగు రంగుల డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. కాగా ఆర్ అండ్​బీ డిపార్ట్​మెంట్​కు అరుదైన గౌరవం దక్కింది. కరీంనగర్‌‌లోని కేబుల్‌‌ బ్రిడ్జి ‘ఔట్‌‌స్టాండింగ్‌‌ కాంక్రీట్‌‌ స్ట్రక్చర్‌‌ ’ విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకుంది. ఇండియన్‌‌ కాంక్రీట్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ హైదరాబాద్‌‌ సెంటర్‌‌ ఇటీవల ఈ అవార్డును ప్రదానం చేసింది.
సౌత్ ఇండియాలో తొలిసారి
కరీంనగర్​లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి లాంటిది నార్త్​ఇండియాలో పశ్చిమ బెంగాల్, ముంబైలో రెండు ఉండగా సౌత్ ఇండియాలో ఇదే మొదటిదని ఆర్ అండ్​బీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బ్రిడ్జిపై లోడ్ టెస్ట్ ను పూర్తి చేశారు. ఒక్కో టిప్పరులో 30 టన్నుల బరువు ఇసుక నింపి వంతెనపై ఇరువైపులా 28 టిప్పర్లను ఉంచారు. వంతెన పై మొత్తం 950 టన్నుల బరువును ఉంచి పరీక్షించారు. వంతెన కింద17 ప్రాంతాల్లో సెన్సార్లను పెట్టి 24 గంటల పాటు పరీక్షించనున్నారు.