
- డివిజన్ల పునర్విభజనతో ఆందోళనలో ఆశావహులు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ను 66 డివిజన్లతో పునర్విభజన ముసాయిదాను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డివిజన్లపై అభ్యంతరాలను ఈనెల 5 నుంచి 11 వరకు 242 అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆమోదం కోసం కలెక్టర్ పమేలాసత్పతికి పంపించారు. బుధవారం కలెక్టర్ ముసాయిదాను ఆమోదించగా.. గురువారం ఉదయం ప్రభుత్వానికి పంపించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు.
మంగళవారం హైదరాబాద్లో జరిగిన సీడీఎంఏ ప్రత్యేక మీటింగ్లో సైతం కమిషనర్ ముసాయిదాను ఉన్నతాధికారులకు అందజేశారు. ఫైనల్ లిస్టు 21న వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్లలో ఎలాంటి మార్పులుంటాయోనని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. తాజా, మాజీ కార్పొరేటర్లకు కొంత అనుకూలం, మరికొంత ప్రతికూలంగా డివిజన్లు మారనున్నట్లు తెలిసింది.
ఏదేమైనా డివిజన్ల పునర్విజన ముసాయిదా మిశ్రమంగా తయారైంది. గతంలో సాలిడ్ గా ఉన్న ఓట్లల్లో కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నారా, లేదా ముసాయిదా ప్రకారమే డివిజన్లు ఉంటాయా అనేది తేలాల్సి ఉంది. గ్రామాలు విలీనమవడంతో రిజర్వేషన్ కూడా మారితే, పరిస్థితి ఏంటని తాజా మాజీలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదేమైనా 21 వరకు డీలిమిటేషన్ ఎలా జరిగిందోనని ఉత్కంఠ నెలకొంది.