
- కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
జమ్మికుంట, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల లక్ష్యమని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. జమ్మికుంట పట్టణ పోలీస్స్టేషన్ను సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు సిబ్బందికి రెయిన్ జాకెట్లు అందజేశారు. అనంతరం రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బందికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీపీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ, సిబ్బందిఉన్నారు.