- వరదలో రెండున్నర కిలోమీటర్లు ఈదిండు..
- బాక్సింగ్లో సిల్వర్ పట్టిండు
ఆగస్టు ఏడో తేదీ. కుండపోత వర్షాలకు ఊళ్లన్నీ మునిగిపోయాయి. ఇళ్ల చుట్టూ నీళ్లే. మనిషి మునిగిపోయేటంత వరద. అదే ఆ యువకుడిని చాలా భయపెట్టింది. కారణం, బెంగళూరులో బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకు అతడు పోవాలి. బస్సుల్లేవ్, ఆటోలు బంద్, నడవడానికీ అదును లేదు. మరెట్ల? సాహసం చేయాలి. ఈదుకుంట పోవాలి. ఇదే ఆ యువకుడి బుర్రకు తట్టింది. తండ్రితో కలిసి 2.5 కిలోమీటర్లు 45 నిమిషాల పాటు ఈదుకుంటెళ్లి మెయిన్రోడ్డు మీద ఎదురు చూస్తున్న జిల్లా టీంను అందుకున్నాడు. రైలెక్కి బెంగళూరు పోయాడు. మూడు రోజులు తిరిగేసరికి వెండి పతకం సాధించాడు. ఇదీ, కర్ణాటకలోని బెలగావి జిల్లా మన్నూర్ అనే ఊరికి చెందిన నిషాన్ మనోహర్ కదమ్ సాహసయాత్రా గెలుపు. మామూలుగైతే ఓ ఐదారు నిమిషాల పాటు ఈదగానే మనం అలిసిపోతం. కానీ, అదేదీ లెక్క చేయలేదు నిషాన్, అతడి తండ్రి. బాక్సింగ్ సామాన్లన్నింటినీ మంచిగ ప్లాస్టిక్ కవర్లో మూటకట్టి, వీపుకు తగిలించుకుని ఈదుకుంటూ వెళ్లారు. నిషాన్ కల తీరింది. సిల్వర్ మెడల్ వరించింది.
‘‘ఈ పోటీల కోసం చాలా ఎదురు చూశా. కానీ, వరదలు నా కలల్ని సమాధి చేస్తాయని భయపడ్డా. బస్సులు, ఆటోలేవీ నడవలేదు. ఆ టైంలో నాకు తోచింది ఈదడమే. అందుకే కష్టమైనా లెక్క చేయకుండా వెళ్లా. ఇప్పుడు గోల్డ్ మిస్సయినా, వచ్చే ఏడాది కచ్చితంగా సాధిస్తా” అని నిషాన్ చెప్పాడు. ఇప్పుడతడిని అందరూ మెచ్చుకుంటున్నారు. అంత కష్టపడి వచ్చినందుకు అభినందిస్తున్నరు. ఈదుకుంటూ వస్తానని చెప్పడంతో, హైవే దగ్గర మేం ఎదురుచూశామని జిల్లా టీమ్ మేనేజర్ గజేంద్ర ఎస్ త్రిపాఠి చెప్పాడు. కాగా, ఈ పోటీల్లో 19 టీమ్ల నుంచి 248 మంది ఆరు కేటగిరీల్లో పోటీపడ్డారు. ఆదివారంతో పోటీలు ముగిశాయి. లైట్ఫ్లై వెయిట్ కేటగిరీలో నిషాన్ పోటీ పడ్డాడు. ఫైనల్లో నిషాన్పై బెంగళూరుకు చెందిన భరత్ గెలిచాడు. కాగా, ఎంజీ స్పోర్టింగ్ అకాడమీలో అర్జున అవార్డ్ గ్రహీత కెప్టెన్ ముకుంద్ కిల్లేకర్ కోచింగ్లో నిషాన్ రాటుదేలాడు. బెలగావిలోని జ్యోతి పీయూ కాలేజ్లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. |