మంచినీటి సమస్యకు చెక్.. జూరాలకు కర్ణాటక నీళ్లు

మంచినీటి సమస్యకు చెక్.. జూరాలకు కర్ణాటక నీళ్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంచినీటి సమస్య తీర్చడానికి 2.5 టీఎంసీల నీటి విడుదలకు ఓకే చెప్పింది కర్ణాటక సర్కార్. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. పాలమూరుకు నీళ్లు విడుదల చేయలంటూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు రాష్ట్ర CS ఎస్ కే జోషి. దీనిపై అక్కడి అధికారులతో చర్చించిన కర్ణాటక సీఎం కుమరాస్వామి.. సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని CM KCRకు ఫోన్ చేసి చెప్పారు కుమారస్వామి. వెంటనే నిర్ణయం తీసుకున్నందుకు కుమారస్వామికి థాంక్స్ చెప్పారు కేసీఆర్. భవిష్యత్ లో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ రెండు రాష్ట్రాలు సహకరించుకుందామని చెప్పారు.

సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు నారాయణ్ పూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభం కానుంది.  మహబూబ్ నగర్ ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణ్ పూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏప్రిల్ 30 న కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు సీఎం కేసీఆర్.