కవిత లేఖ...నాలుగు స్తంభాలాట.. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు

 కవిత లేఖ...నాలుగు స్తంభాలాట.. ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు

ఇటీవల జాగృతి కవిత వాళ్ల నాన్నకు  ఒక లేఖ రాయగానే ఏదో అంతర్గతంగా జరిగిపోతుందని.. చిలవలు పలవలుగా ఎవరికి తోచింది వాళ్ళు ఊహించుకుంటున్నారు.  ఇది ఇలా ఉండగానే  బీఆర్ఎస్ పార్టీలో కవిత నిర్ణయాలు తనదైన రీతిలో తీసుకుంటున్నారు.  కవిత  రాజకీయ వ్యూహాల  నిర్ణయాలు రోజుకోవిధంగా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకరు బీఆర్ఎస్ పార్టీ  పని ఇక అయిపోయిందని అంటే, మరొకరు  కేసీఆర్  దృష్టిలో పడితే అంతేసంగతులని కవిత,  హరీష్​లు ఇకముందు వారి దారి వారు చూసుకోవాలి అని ఉద్బోధిస్తున్నారు.  

ఇది వారి కుటుంబ సభ్యుల పట్ల పార్టీ అధ్యక్షుడు  కఠిన నిర్ణయాలు తీసుకోలేడని,  అటువంటి నిర్ణయాలు ఇతరులకు మాత్రమే వర్తిస్తాయని గమనించక  తెలియక ప(త) ప్పులో  కాలు వేస్తుంటారు. సంబంధిత పార్టీలో ఏదో జరగబోతోందని ఒక చర్చను అప్పుడే మీడియాలో చర్చోపచర్చలు లేవదీశారు.  

అమెరికా నుంచి వచ్చిన  కవిత విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ..తన నాన్న దేవుడని దేవుడి చుట్టూ గత పది ఏళ్లలో కనబడని దయ్యాలు తిరుగుతున్నాయని ఆరోపించింది. దాంతో మూడు రోజులుగా కవిత ఎపిసోడ్​నడుస్తూనే పోతున్నది.  బీఆర్ఎస్  పార్టీ కుటుంబంలో సంక్షోభం ఏర్పడినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తమ మధ్య తీవ్ర వైరుధ్యాలు మోతాదుకు మించి అసంతృప్తులు ఉన్నట్టు వారే స్వతహాగా లీకులు ఇస్తుంటారు.  

2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఎన్నికలలో అధికారం చేపట్టాక  ఇక టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదు,  ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ స్వయంగా ప్రకటించాడు. అప్పటికే  పక్కా తెలంగాణవాదులను  కేసీఆర్  ముందు  జాగ్రత్తతో  ఏదో నెపం మోపి బయటకు పంపించాడు.  తనకు  తన కుటుంబ నాయకులకు ఉద్యమకారుల  నుంచి కొంచెం కూడా ముప్పు,  విమర్శలు ఒత్తిళ్లు ప్రశ్నలు రాకుండా ముందే తగుచర్యలు తీసుకున్నాడు. తనకు, తన కుటుంబానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు.

మిషన్ల పేరిట అప్పులు

నీళ్లు,  నిధులు, నియామకం ప్రధాన పతాక నినాదాన్ని తిరగేసి మిషన్ల పేరిట ప్రత్యక్ష, పరోక్ష అప్పులు తెచ్చి తెలంగాణ అభివృద్ధి పేరున ప్రజల చెవుల్లో ప్లాస్టిక్ పువ్వులు పెట్టారు.  పదేళ్లలో ఈ నాయకులు పట్టపగ్గాలు లేకుండా సంపాదించి  ప్రజలతో కన్ను మిన్నూ కానకుండా ప్రవర్తించారు. 

అధికారం కోల్పోయిన తర్వాత కూడా కుటుంబ నాయకులలో ఒకరైన  కేటీఆర్ తెల్లారి లేస్తే ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండడం వలన.. గత పది సంవత్సరాలలో తాము చేసిన  నిర్వాకాన్ని అడుగడుగునా  గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తున్నది.  కానీ,  ప్రజలు తన వాదనల గురించి, తమ పార్టీ గురించి ఆలోచించడం లేదని ఆయన తెలుసుకోలేకపోతున్నారు.

 కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో రాజకీయం మాత్రమే కనిపిస్తున్నది. ఇకపోతే  హరీష్ రావు తన కోటరీని కాపాడుకుంటూ,  ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద  తీస్మార్ ఖాన్ లా మీడియాను మేనేజ్ చేస్తూ తన తీవ్ర అసంతృప్తిని బయట పడనీయకుండా సెల్ఫ్ డిఫెన్స్ రాజకీయ క్రీడ ఆడుతున్నాడు.

రాజకీయ అతిథిలా కేసీఆర్

కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం తర్వాత కూడా నేనూ  మైదానంలో ఉన్నానని అప్పుడప్పుడు అధికార పార్టీని విమర్శిస్తుంటుంది.  పైకి పార్టీలో వీరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్టు  ప్రవర్తిస్తుంటారు.  పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి అప్పుడప్పుడు రాజకీయ అతిథిలా తెరమీదికి వచ్చిపోతుంటాడు. 

పార్టీలో సంక్షోభాలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడల్లా వీరు నాలుగు స్తంభాల ఆట ఆడుతుంటారు. ప్రజలు ఓడించినప్పటికీ కనీసం జ్ఞానోదయం కలగకపోవడం కానీ పశ్చాత్తాపం ప్రకటించకపోవడం వలన వీరికి అహం ఎంత ఉందో అర్థం అవుతుంది. పార్టీకీ దాని నాయకులకు ప్రజలలో పతారా దిగజారి పోయిందని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. పైగా వీరు ఎలక్ట్రానిక్,  ప్రింట్,  సోషల్ మీడియాలలో తమ గురించి అహరహం ఉండేలా, ప్రచారం జరిగేలా చూసుకోవడానికే ఉవ్విళ్ళూరుతుంటారు.   

బీఆర్ఎస్ పార్టీలో ఒక  అననుకూల వాతావరణం ఏర్పడిందని కుటుంబ సభ్యుల నడుమ తీవ్ర విభేదాలు ఉన్నట్టు  టీకప్పులో తుపాన్లు సృష్టిస్తుంటారు. వీరందరూ ఎన్నెన్ని మాటలు చెప్పినా మాట్లాడినా ఇప్పటికీ  కేసీఆర్ చాటు బిడ్డలేనని  భావించాల్సి వస్తుంది.

కేసీఆర్​ కౌంటర్​ రాజకీయాలు

గతంలో షర్మిల ఆశించిన కోరిక  తీరకపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్​కు అధ్యక్ష సారథ్య బాధ్యతలతో సర్దుకున్నది. తన అన్నను  జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేయగలిగింది. కానీ. అక్కడ షర్మిల తండ్రి లోకంలో లేని సమయంలో ఇదంతా జరిగింది.  కానీ,  కవిత తండ్రి కేసీఆర్ జీవించి ఉన్నాడు. 

తమ వ్యూహాలు పని చేయనప్పుడు  కౌంటర్ రాజకీయాలు రచించి అమలు చేయడం కేసీఆర్ లక్షణం. అది గతంలో  మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​ను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. తిరిగి ఇప్పుడు అలాగే  కవిత ద్వారా కేసీఆర్ అటువంటి స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం  నిర్వహిస్తున్నా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.

 తాము పోగొట్టుకున్నచోటే అధికారం వెతుక్కోవడానికి కవితను ఇప్పటికీపల్లెత్తు మాట్లాడక, కేసీఆర్ తన మూస రాజకీయ వ్యూహాలను అదే దేశీయ  రాజకీయ కవ్వంలో  వేసి నూరుతుంటాడు. ఆయన అవకాశాల కోసం  దెబ్బతిన్న పులిలా ఏ చిన్న గడ్డి పోస ఆధారం అవకాశం దొరికినా పాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంటాడని..  కేసీఆర్ గత రాజకీయ చరిత్రను నిశితంగా గమనించిన వారు అనుకోవడానికి ఆస్కారం ఉంది.

- జూకంటి జగన్నాథం,కవి, రచయిత-