కవిత మధ్యలో వచ్చి.. మధ్యలోనే పోయారు...కాంగ్రెస్తో మంతనాలు చేయాల్సిన అవసరం లేదు

కవిత మధ్యలో వచ్చి.. మధ్యలోనే పోయారు...కాంగ్రెస్తో మంతనాలు చేయాల్సిన అవసరం లేదు
  • నేను, నా తండ్రి బీఆర్ఎస్​ వ్యవస్థాపక సభ్యులం 
  • బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్ లో చేరడానికి తాను ఎవరితోనూ మంతనాలు చేయలేదని, తనకు ఆ అవసరం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి తెలిపారు. భీంగల్  లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓడిపోగానే తాను కాంగ్రెస్​తో మంతనాలు చేసినట్టు కవిత చేసి ఆరోపణలపై స్పందిస్తూ, తాను అలాంటి ప్రయత్నాలు చేయలేదని దేవుడి సమక్షంలో చెప్తున్నానని.. కవిత కూడా కాంగ్రెస్​ నేతలతో సంప్రదింపులు చేయలేదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. 

మధ్యవర్తుల ద్వారా కవితకు నచ్చజెప్పేందుకు తాను ప్రయత్నాలు చేసినట్టు చెప్పారు. తనకు, తన తండ్రికి మధ్య ప్రశాంత్​రెడ్డి దూరం పెంచారన్న ఆరోపణలు ఖండించారు. కవితతో తాను స్వయంగా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపించానని, ఆమె మొండిగా వ్యవహరించారని తెలిపారు. పార్టీ లైన్​ దాటిన తర్వాతే కేసీఆర్​ కవితపై చర్య తీసుకున్నట్టు చెప్పారు. తానూ తన తండ్రి పార్టీ వ్యవస్థాపక సభ్యులమని, కవిత మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయారన్నారు. 

కేసీఆర్ కు దగ్గరగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, హరీశ్ రావు లాంటి వారిని కవిత టార్గెట్  చేస్తోందని, అందులో భాగంగానే తనమీద ఆరోపణలు చేశారన్నారు. కవిత రెండు సార్లు ఎమ్మెల్సీ కావడం వెనుక తన పాత్ర ఏంటో కేసీఆర్ కు తెలుసన్నారు. అంతకుముందు కాంగ్రెస్ హామీల కార్డుతో ఆలయంలో పూజలు చేసి, నిరసన తెలిపారు.