- చలో సెక్రటేరియెట్లో కవిత డిమాండ్
- పలువురు ఆందోళనకారుల అరెస్టు
మెహిదీపట్నం, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శనివారం చలో సెక్రటేరియెట్ కు బయల్దేరిన ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేసి మెహిదీపట్నం, నాంపల్లి, సహా పలు పీఎస్లకు తరలించారు. మెహిదీపట్నం పీఎస్లో ఉద్యమకారులకు కవిత సంఘీభావం ప్రకటించారు. వారిని విడిచిపెట్టే వరకు అక్కడి నుంచి కదిలేది లేదన్నారు.
ఉద్యమకారులను విడుదల చేసిన తర్వాత వారిని తీసుకొని వెళ్లారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఉద్యమకారులను జైల్లో పెట్టడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్నదే ఉద్యమకారులు అని గుర్తుచేశారు. అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు పెన్షన్, భూమి ఇస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రెండున్నరేళ్లు గడుస్తున్నా హామీలు అమలుచేయడం లేదని ఫైరయ్యారు. ఇప్పటికే ఉద్యమకారుల తరపున భూపోరాటాలను జాగృతి ప్రారంభించిందని తెలిపారు.

