- ఎన్నికల్లో ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్.. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకే పరిమితం
- నేను పార్టీ పెడ్తున్నా అనగానే బీఆర్ఎస్ వాళ్లు అహంకారంతో మాట్లాడిన్రు
- తోకపార్టీ సీపీఐకి ఇప్పుడు.. బీఆర్ఎస్ పార్టీనే తోకపార్టీగా మారిందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ప్రజలు గుడి కట్టారని ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్.. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. వారికి 17 స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడారని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వచ్చిన స్థానాలతో పోల్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటిదానితో పోలిస్తే.. చాలా స్థానాలు కోల్పోయిందన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అట్టర్ఫ్లాప్ అయిందన్నారు.
శనివారం ఆమె హైదరాబాద్లోని జాగృతి ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారన్నారు. తాము రాజకీయపార్టీగా వస్తామని చెప్పగానే బీఆర్ఎస్ వాళ్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారన్నారు. వాళ్లకు ఒకటే చెబుతున్నా.. ‘ఇది కేవలం ట్రైలరే.. అసలు పిక్చర్ బాకీ హై’ అని పేర్కొన్నారు. ఇప్పుడే కారుకూతలు కూయొద్దని హెచ్చరించారు.
ఉద్యమకారులకు మంచి చేయాలని తాను మాట్లాడితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి అహంకారం తగ్గించుకోకుంటే.. ఇలాంటి ఫలితాలే వస్తాయని విమర్శించారు. సీపీఐ అడగకుండానే కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం దిగజారిపోవడమేనన్నారు. గతంలో తోకపార్టీ అని విమర్శించిన పార్టీకే.. ఇప్పుడు బీఆర్ఎస్ తోక పార్టీగా మారిందన్నారు.
ఎన్నికల్లో మాలాంటోళ్లను ఆదరించారు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే.. రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ తప్ప అన్నిచోట్లా అష్టకష్టాలూ పడిందని కవిత అన్నారు. ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త అభ్యర్థులను ప్రజలు ఆదరించారని, త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పోటీ చేశామని తెలిపారు.
సమయం తక్కువగా ఉన్నా కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేశామన్నారు. వడ్డేపల్లిలోనూ తాము క్లియర్గా గెలిచినా.. కాంగ్రెస్ వాళ్లు ప్రలోభపెట్టి వాళ్లను లాక్కునే ప్రయత్నాలు చేశారన్నారు. నారాయణపేటలోనూ వైస్చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నారని తెలిపారు. నిర్ణయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలేశామన్నారు.
ప్రభుత్వ పైసలు పెట్టి ప్రచారం
గ్రామ పంచాయతీ, మున్సిపల్ఎన్నికల్లో చట్టాలు, పరిమితులను సీఎం పూర్తిగా ఉల్లంఘించారని కవిత ఆరోపించారు. గ్రామాల్లో ప్రభుత్వ ధనంతో ప్రచారం నిర్వహించారని.. అయినా కూడా ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘సీఎం రేవంత్.. నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నారు. దానికి ఆరు నెలలు బోనస్గా కలిసి వస్తుందని చెబుతున్నారు. ముందు ఆయన రైతులకు బోనస్ ఇవ్వాలి. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికల్లోనూ హెచ్ఎంఎస్, జాగృతి కలిసి పనిచేస్తాయని”అని కవిత అన్నారు.
