ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో పీకేతో కేసీఆర్ దోస్తీ

ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో  పీకేతో కేసీఆర్ దోస్తీ
  • ఇతర పార్టీలు కలిసి రాకపోవడంతో ప్రశాంత్​ కిశోర్​తో కేసీఆర్​ దోస్తీ
  • ఆయనకున్న పరిచయాలతో గట్టెక్కాలని వ్యూహం
  • ఫస్ట్ ఇన్నింగ్స్​ ఫెయిల్​ అవటంతో సెకండ్​ ట్రయల్స్​

సపోర్టు కోసమే

ఏడాదిన్నరగా రాష్ట్రంలో వరుసగా టీఆర్​ఎస్​కు ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్​ ఓటమి, ధాన్యం సేకరణ వివాదం, వరుసగా రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఉద్యోగుల నిరసనలు.. అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. బీజేపీ కూడా రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్​ పెట్టడంతో చిక్కుల్లో పడ్డామనే భావన టీఆర్​ఎస్​లో వ్యక్తమవుతున్నది. అందుకే కేంద్రాన్ని టార్గెట్​గా చేసుకొని కేసీఆర్​ వరుసగా ప్రెస్​మీట్లు పెడుతున్నారనే వాదనలున్నాయి. అయితే.. జాతీయ స్థాయిలో కేసీఆర్​ను సపోర్టు చేసే లీడర్లు లేకపోవటం, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కలిసి రాకపోవటం ఆయనకు మైనస్​గా మారింది. అందుకే.. కేసీఆర్​ ఏరికోరి  పీకేను తెచ్చుకున్నట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు.  

హైదరాబాద్​, వెలుగు: పొలిటికల్​ స్ట్రాటజిస్ట్​ ప్రశాంత్​ కిషోర్​తో ఇటీవల సీఎం కేసీఆర్ చర్చల మీద చర్చలు జరుపుతుండటం రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది. తమతో కలిసి ఉండాలని పీకేతో ఆయన ఒప్పందం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ జాతీయస్థాయిలో తనను ప్రమోట్​ చేసుకునేందుకు నాలుగేండ్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇతర రాష్ట్రాల సీఎంలతో, పార్టీలతో జరిపిన చర్చలు, భేటీలు ఆశించిన ఫలితాన్నివ్వడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో జాతీయ రాజకీయాల కోణంలో  కేసీఆర్​ ఒంటరి అయ్యారు. అందుకే ఇప్పుడు పీకేతో దోస్తీ చేసుకొని సెకండ్​ ట్రయల్స్​ మొదలు పెట్టారని టీఆర్​ఎస్​ సీనియర్​ లీడర్లు అంటున్నారు. పీకేకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు, పాపులారిటీ కలిసి వస్తుందనే ధీమాతో తనను ప్రమోట్​ చేసుకునే పనిలో సీఎం ఉన్నారని చెప్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మాత్రం.. ‘‘కేసీఆర్ కు మించిన వ్యూహకర్త లేరు. ఆయనే మాకు పెద్ద వ్యూహకర్త. ప్రశాంత్​ కిషోర్​ వ్యూహాలు మాకు అవసరం లేదు..’’ అని ఆఫ్​ ది రికార్డులో చెప్పారు. కేసీఆర్​ వ్యూహం మాత్రం పీకేను వెనుకబెట్టుకొని తను ముందుకు వెళ్లాలనే ఉందని టీఆర్​ఎస్​లోని కొందరు లీడర్లు అంటున్నారు. 

ఏవీ కలిసి రాకపోవడంతో..!

హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఓటమి తర్వాత తమపై ప్రజా వ్యతిరేకత ఎందుకు పెరిగిందని టీఆర్​ఎస్​ వివిధ సంస్థలతో రాష్ట్రంలో సర్వేలు చేయించుకుంది. తర్వాత పీకే టీమ్ మెంబర్​ సునీల్​తో  మంత్రి  కేటీఆర్​ పలుమార్లు చర్చలు జరిపారు.  ఇటీవల జరిగిన మూడో దఫా చర్చల్లో.. తమతో కలిసి ఉండాలని పీకేతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.  పీకే తమతో ఉంటే  జాతీయ స్థాయిలో తోడుగా ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లోని లీడర్ల యాక్సెస్​ ఈజీ అవుతుందని టీఆర్‌‌‌‌ఎస్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్  బీజేపీ, కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఫెడరల్​ ఫ్రంట్​ ఏర్పాటు చేస్తామని మీడియాకు లీకులిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేందుకు బయల్దేరుతున్నట్లు అప్పట్లో బహిరంగంగానే ఆయన ప్రకటించారు. స్వయంగా ఇతర  రాష్ట్రాలకు వెళ్లి పలువురు  సీఎంలతో  చర్చలు జరిపారు. అయితే.. పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతిచ్చిన కేసీఆర్‌‌‌‌తో వెళ్లడం కరెక్ట్​ కాదని ఇతర పార్టీలు వెనక్కి తగ్గినట్లు ప్రచారంలో ఉంది. ఈ పరిణామాలతో కేసీఆర్​ తన సెకండ్​ ఇన్నింగ్స్​కు బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే  ఎలక్షన్  స్ట్రాటజిస్ట్‌‌‌‌ ప్రశాంత్ కిశోర్‌‌‌‌ను తెచ్చుకున్నట్లు చర్చ మొదలైంది. ఆయనను వెనుక బెట్టుకొని జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది.