- ప్రాజెక్టు ఇష్యూపై ప్రభుత్వానికి సవాల్ విసిరిన గులాబీ బాస్
- అసెంబ్లీ తర్వాత సభలు పెట్టాలని గతంలో నిర్ణయం
- ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సాకుతో వెనక్కి
హైదరాబాద్, వెలుగు: ‘ఇగ నేనొస్తున్నా.. మీ తోలుతీస్తం’.. ఇదీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూపై ఇటీవల కేసీఆర్ చెప్పిన మాట. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతున్నదని, ఇక పోరాటమేనని ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరారు. సభలు పెడ్తానన్నారు. కానీ, ఇప్పుడు ఆ సభలను కేసీఆర్ రద్దు చేసుకున్నట్టు తెలుస్తున్నది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల కోసం మంత్రి ఉత్తమ్ రాసిన లేఖపై.. నిరుడు డిసెంబర్ 21న తెలంగాణభవన్లో కేసీఆర్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశం సందర్భంగానే ప్రభుత్వం తోలుతీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
డిసెంబర్ 29న అసెంబ్లీ సెషన్ను ప్రభుత్వం నిర్వహించింది. వారం రోజులపాటు సభను నిర్వహించినా బీఆర్ఎస్ బాయ్కాట్ చేసి ప్రభుత్వానికి సమాధానం చెప్పలేకపోయింది. అసెంబ్లీ సెషన్ ముగిశాక ‘పాలమూరు’ సభలను నిర్వహించాలని ముందుగా బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించారు. అసెంబ్లీ ముగిసి దాదాపు మూడు వారాలవుతున్నా ఆ సభలపై ఉలుకూపలుకూ లేదు. డిసెంబర్ 21న తెలంగాణభవన్లో మీటింగ్ తర్వాత ఫాంహౌస్కు వెళ్లిపోయిన కేసీఆర్.. మళ్లీ అసెంబ్లీ సెషన్ ప్రారంభ రోజున సంతకం పెట్టేందుకు వచ్చారు. ఐదు పది నిమిషాలు సభలో గడిపి ఇంటికెళ్లిపోయారు. అప్పటి నుంచి ‘కేసీఆర్ పోరాటాలపై’ కనీస చర్చ కూడా జరగలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే కేసీఆర్ తన పాలమూరు సభలను రద్దు చేసుకున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది.
వాళ్ల లోపం బయటపడుతుందనేనా..
మున్సిపల్ ఎన్నికల పేరు చెబుతున్నా.. అసలు విషయం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో బీఆర్ఎస్ చేసిన తప్పులే కనిపిస్తాయన్న ఉద్దేశం కూడా సభల రద్దుకు కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మంత్రి ఉత్తమ్.. కేవలం 45 టీఎంసీలకే అనుమతి ఇవ్వాలని లేఖలో రాయలేదు. రెండో ఫేజ్లో కచ్చితంగా మిగతా 45 టీఎంసీలనూ వాడుకుంటామని స్పష్టంగా రాశారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేవలం 45 టీఎంసీలకే ప్రభుత్వం పాలమూరును పరిమితం చేసిందంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే ఇప్పుడు లేఖలోనూ రాశామని మంత్రి ఉత్తమ్ కూడా కౌంటర్ ఇచ్చారు.
అయితే, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు మీద సభలు పెట్టి ప్రజలకు ఏమని చెప్పాలని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచనలో పడినట్లు తెలిసింది. ఎన్నికల టైంలో ఒక్క పంపును ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోశారుగానీ.. కనీసం ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం విషయంగానీ.. ఆ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటరీలు, కాల్వల తవ్వకంపనులనుగానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే సభలు పెడితే ప్రజల ముందు దొరికిపోతామన్న యోచనతోనే రద్దు చేసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలయ్యాకైనా పెడతారా పెట్టరా అనే దానిపై బీఆర్ఎస్ వర్గాల నుంచి క్లారిటీ లేకపోవడం గమనార్హం.
