
- రాష్ట్ర ఏర్పాటులో మేమే చాంపియన్ అంటూ సెలబ్రేషన్స్ కు దూరం
- తెలంగాణ భవన్ లో ఉత్సవాలకు కేసీఆర్, కేటీఆర్, కవిత గైర్హాజరు
- ఆఫీసుకు వచ్చిన హరీశ్, జెండా ఎగురవేసిన మధుసూదనాచారి
- అస్తిత్వం.. ఆత్మగౌరం ఆగమాగం
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో తామే చాంపియన్స్ అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇవాళ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ వేడుకులకు గైర్హాజరయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ ఎప్పటిలాగే ఎర్రవల్లి ఫాంహౌస్ కే పరమితమయ్యారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించినట్టు పదే పదే చెబుతున్న ఆయన ఈ సారి పార్టీ కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొనలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఫాంహౌస్ కు పరిమితమయ్యారు.
కేసీఆర్ కేవలం మూడు సార్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటున్నారు. గత ఏడాది తెలంగాణ భవన్ లో జరిఇన వేడుకలకు వచ్చిన కేసీఆర్ ఈ సారి మాత్రం రాలేదు. కవిత లేఖ తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారని, జెండాను ఆవిష్కరించి కీలక అంశాలను ప్రస్తావిస్తారని భావించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డల్లాస్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. తమకు తెలంగాణపై ప్రేమ తగ్గదంటూ చెప్పుకొచ్చారు.
కవిత సెపరేట్!
ఎమ్మెల్సీ కవిత ఇవాళ కూడా వార్తల్లో నిలిచారు. ఆమె బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ ఉత్సవాలకు హాజరు కాలేదు. గత ఏడాది ఇదే రోజున లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్న కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణ భవన్ కు వెళ్లకుండా తన ఇంట్లో ఏర్పాటు చేసిన భారత జాగృతి కార్యాలయంలోనే జెండాను ఆవిష్కరించారు. ఇటీవల ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కు బీఆర్ఎస్, భారత జాగృతి రెండు కళ్లని చెప్పారు. అంటే ఆమె డైరెక్టుగానే బీఆర్ఎస్ నుంచి దూరమయ్యారా..? అనే టాక్ కూడా వస్తోంది.
ఆ ముగ్గురూ లేకుండానే..
ఎల్కతుర్తి రజతోత్సవ సభ తర్వాత గ్రౌండ్ రిపోర్టు పేరుతో ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్ ను ఎత్తి చూపారు. ఆమె అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆ లేఖ బయటికి రావడం పెను దుమారం రేపింది. అమెరికా నుంచి వచ్చిన కవిత.. ఆ లేఖ తానే రాసినట్టు చెప్పారు.
కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కామెంట్ చేశారు. మరుసటి రోజు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మీడియాలో చిట్ చాట్ చేసిన కవిత.. కేటీఆర్, హరీశ్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. లేఖ రాసిన కవిత, ఆరోపణలు చేసిన కేటీఆర్.. వివాదాన్ని పరిష్కరించాల్సిన కేసీఆర్... ఈ ముగ్గురూ హాజరు కాకుండానే ఆవిర్భావ ఉత్సవాలు జరగడం విశేషం.
జెండా ఆవిష్కరించిన చారి
తెలంగాణ భవన్ లో జరిగిన ఆవిర్భావ ఉత్సవాల్లో పార్టీ సెక్రటరీ జనరల్, మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. బీజేపీలో పార్టీని కలిపే ప్రసక్తే లేదని, ఒంటరిగానే వంద సీట్లతో అధికారంలోకి వస్తామని, కేసీఆర్ మరోమారు సీఎం అవుతారని అన్నారు.