కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎటెటో పోతున్నరట.. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ లో ఉంది. దాన్ని కాపాడుకోవడంపై కేసీఆర్ దృష్టిపెడితే మంచిది” అని సూచించారు. శనివారం రాత్రి మీడియా సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే ర్యాలీలు చేయని కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ర్యాలీలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అగౌరవపరిచేలా సీఎం కేసీఆర్ నడుచుకుంటున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
రాష్ట్రపతి ఎన్నికలు ఏమైనా.. పబ్లిక్ ఎన్నికలా..?
ప్రచార ర్యాలీలు నిర్వహించడానికి రాష్ట్రపతి ఎన్నికలు ఏమైనా పబ్లిక్ ఎన్నికలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘‘యశ్వంత్ సిన్హా గెలిచేది లేదు.. ఏం లేదు.. ర్యాలీలతో ఆర్భాటం చేయడం అవసరమా..? అదేమైనా గ్రామ సర్పంచ్ ఎన్నిక అనుకున్నవా కేసీఆర్ ?” అని వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిర నిర్మాణం, పేదలకు ఇళ్లు, అన్నయోజన బియ్యం పంపిణీ, స్వచ్ఛ భారత్, గ్రామీణ సడక్యోజన వంటి పథకాలన్నీ మోడీ వల్లే జరిగాయని సంజయ్ గుర్తు చేశారు. పంజాబ్ కు వెళ్లి రైతులకు రూ.3 లక్షలు ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణ రైతులకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన రైతు ద్రోహి కేసీఆర్ అని కామెంట్ చేశారు. ఆదివారం సాయంత్రం 4గంటలకు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సంజయ్ పిలుపునిచ్చారు.