
- అబ్జర్వేషన్లో పెట్టిన డాక్టర్లు.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి
- హెల్త్ బులిటెన్ విడుదల చేసిన యశోద హాస్పిటల్ యాజమాన్యం
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. కేసీఆర్ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయన హై షుగర్ (మధుమేహం), లో బీపీతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సాధారణ హెల్త్ చెక్ అప్లో భాగంగా కేసీఆర్ గురువారం సాయంత్రం యశోద ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు పలు టెస్టులు చేశారు.
అందులో చక్కెర స్థాయిలు ఎక్కువగా, సోడియం తక్కువ స్థాయిలో ఉన్నట్టు తేలడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాలని డాక్టర్లు ఆయనకు సూచించారు. షుగర్, బీపీ మినహా మిగతావన్ని సాధారణ స్థాయిల్లోనే ఉన్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు. షుగర్ను కంట్రోల్ చేయడానికి, బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడానికి డాక్టర్లు కేసీఆర్ను అబ్జర్వేషన్లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. కేసీఆర్తో పాటు ఆయన భార్య శోభ, కుమారుడు కేటీఆర్ ఆసుపత్రికి వెళ్లినట్టు తెలిసింది.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయం ఫామ్ హౌస్లోనే గడుపుతున్నారు. ఇటీవల ఫామ్ హౌస్లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనకు ఆపరేషన్ చేయగా, చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జూన్ 11న కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణకు హాజరై తన వెర్షన్ను వినిపించారు. ఆ వెంటనే ఫామ్హౌస్కు వెళ్లిపోగా, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు.