హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను పట్టించుకోని కేసీఆర్.. ప్రగతిభవన్లోకి ఉద్యమ ద్రోహులకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ ఒక్కడు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు సభలో పదేపదే ప్రస్తావించడంపై పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని, సకల జనులు పోరాడితే వచ్చిందన్నారు.
నాడు ఎంపీలుగా ఉన్న తాము పార్లమెంటులో, పార్టీలో కొట్లాడి తెలంగాణ కోసం సోనియాగాంధీని ఒప్పించామన్నారు. అప్పట్లో తమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కొడుకు జగన్ను కూడా తాము వ్యతిరేకించామని, అదే జగన్ను కేసీఆర్ ఇంటికి పిలిచి బొకేలు ఇచ్చిండని పొన్నం గుర్తు చేశారు. ద్రోహులతో దోస్తీ చేసి, రాష్ట్ర రైతుల జీవితాలను ఆంధ్రకు కేసీఆర్ కట్టబెట్టిండని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకుని దోచుకున్నారని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని సభలో పొన్నం గుర్తు చేశారు. ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించాలన్నారు. ఢిల్లీకి పోయి కేంద్రంతో కొట్లాడేందుకు కలిసి రావాలని పొన్నం కోరారు.