ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనిర్మల కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. ఆమె మరణం చిత్రపరిశ్రమకు తీవ్ర లోటుగా పేర్కొన్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ నటిని, దర్శకురాలను కోల్పోయిందన్నారు. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయనిర్మల మృతిపై స్పందిస్తూ.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మలగారు కన్నుమూయడం ఎంతో బాధాకరమన్నారు. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మలగారు ఒకరని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ తో విజయనిర్మల మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్రకుటుంబం సినిమాల్లో నటించినట్టు పేర్కొన్నారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.