కాళేశ్వరం కమిషన్ ఎదుట.. ముగిసిన కేసీఆర్ విచారణ.. హైలైట్స్ ఇవే..

కాళేశ్వరం కమిషన్ ఎదుట.. ముగిసిన కేసీఆర్ విచారణ.. హైలైట్స్ ఇవే..

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ను వన్ టూ వన్ విచారించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ విచారణ మొదలైంది. 12 గంటల 50 నిమిషాలకు కేసీఆర్ బయటికొచ్చి కార్యకర్తలకు అభివాదం చేసి బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీపీటీ సీడీని కమిషన్కు కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఒంటరిగానే విచారణ సాగింది. 

ముఖ్యమైన అధికారులు, ఇంజినీర్లను, మాజీ మంత్రులు ఈటల, హరీశ్​రావును ఓపెన్ కోర్టు ద్వారా విచారించిన  ఘోష్ కమిషన్.. అందరి సమక్షంలోనే ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టిన సంగతి తెలిసిందే.  కానీ కేసీఆర్ను మాత్రం ఆయన విజ్ఞప్తి మేరకు ఓపెన్​కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విధానంలో విచారించింది. ఈ విధానంలో ఎంక్వైరీ హాల్లో కమిషన్​ చైర్మన్ పీసీ ఘోష్, కేసీఆర్​ మాత్రమే ఉండి, క్రాస్​ఎగ్జామినేషన్​ప్రక్రియను కెమెరా ద్వారా రికార్డు చేశారు. ఓపెన్​కోర్టులో క్రాస్​ఎగ్జామినేషన్​ జరుగుతున్న తీరును హరీశ్​రావు ద్వారా తెలుసుకున్న కేసీఆర్, ఇన్​కెమెరా ఎంక్వైరీ వైపు మొగ్గు చూపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ ప్రధానంగా కేసీఆర్కు ప్రశ్నలు సంధించింది. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. విచారణ అనంతరం ఎర్రవల్లి ఫాంహౌస్కు కేసీఆర్ వెళ్లిపోయారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ విచారణకు వెళ్లిన సమయంలో ఆయన వెంట హరీష్ రావు, కవితతో పాటు పలువురు నేతలు బీఆర్కే భవన్ వరకూ వెళ్లారు.