నల్గొండలో సభ పెట్టి తీరుతం: కేసీఆర్

నల్గొండలో సభ పెట్టి తీరుతం: కేసీఆర్
  • కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే సర్వం కోల్పోతం: కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్​ప్రాజెక్టులను అప్పగిస్తే సర్వం కోల్పోతామని బీఆర్​ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. అధికారులను పంపి ప్రాజెక్టుల అప్పగింతకు ఈ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటదని మండిపడ్డారు. ప్రాజెక్టులను బోర్డుకు రాసిచ్చేసి అదేదో కేసీఆర్ ​చేసిన తప్పు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం నిజం కాదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్​జిల్లాల ఎమ్మెల్యేలు, బీఆర్​ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్​ప్రభుత్వాన్ని దించేసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టినా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ ​షెకావత్​కు ముఖం ముందట్నే చెప్పానన్నారు.

 ప్రాజెక్టులపై అసెంబ్లీలో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కొట్లాడితే నల్గొండ సభ వేదికగా తాను, సీనియర్​లీడర్లు కొట్లాడుతారని అన్నారు. ‘‘నల్గొండలో సభ పెట్టనివ్వరట.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరు అడ్డుకోవడానికి.. నల్గొండ వాళ్ల జాగీరా.. ఎట్లా పెట్టనివ్వరో చూద్దాం.. వాళ్లు పర్మిషన్ ​ఇయ్యకుంటే కోర్టుకు పోయి తెచ్చుకుంటం” అని అన్నారు. కొత్త సీఎంవి పిల్ల చేష్టలని, పాలన చేతకాక తనపై కారు కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ‘‘కొత్త సీఎం నన్ను వ్యక్తిగతంగా.. బీఆర్ఎస్​ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నడు.. నన్ను, నా పార్టీని టచ్​చేయడం నీతో కాదు.. నీకంటే హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాది.. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం” అన్నారు. ఈ నెల 13న నిర్వహించే చలో నల్గొండ సభను సక్సెస్​ చేయాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు.

ALSO READ : కోఠి మెటర్నిటీ హాస్పిటల్​లో పసికందు మృతి