విశ్వనాథ్ సినిమా తీస్తానంటే..నేను నిర్మాతనవుతా: కేసీఆర్

విశ్వనాథ్ సినిమా తీస్తానంటే..నేను నిర్మాతనవుతా: కేసీఆర్

ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ తో..  సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని ఆయనకు మాటిచ్చారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ ఇంటికి ఈ మధ్యాహ్నం వెళ్లిన సీఎం… ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, కొడుకు రవీంద్రనాథ్, కోడలు గౌరి, దర్శకుడు ఎన్.శంకర్ ఇతరులు.. కేసీఆర్ కు స్వాగతం పలికారు. విశ్వనాథ్ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని సన్మానించారు.

సీఎంతో పాటు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం లాంటి అంశాలపై గంటకు పైగా ఆసక్తికరమైన చర్చ జరిగిందని సీఎంఓ తెలిపింది.

“నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది” అని సీఎం కేసీఆర్.. విశ్వనాథ్ తో చెప్పారు.

“మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ, పాటలు గానీ, కళాకారుల ఎంపిక గానీ, సన్నివేశాల చిత్రీకరణ గానీ, సంభాషణలు గానీ ప్రతీదీ గొప్పగా ఉంటాయి. కుటుంబ మంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నా” అని కేసీఆర్ … కళాతపస్వితో అన్నారు.

“విశ్వనాథ్ గారూ.. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి” అని ముఖ్యమంత్రి ఆయన్ని కోరారు.

“మీరు అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైంది. మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి మీరు నాతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారని అనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరుగా చూడడం ఇదే మొదటి సారి. చాలా సంతోషంగా ఉంది. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటి వారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది’ అని విశ్వనాథ్ అన్నారు.

తన ఆరోగ్యం గురించి కేసీఆర్ వాకబు చేసిన సందర్బంగా విశ్వనాథ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

“నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. రక్తం అంటే భయం. ఇక నేనేమి ఆపరేషన్ చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా” అని విశ్వనాథ్ చెప్పారు.

కేసీఆర్ ను ఉద్దేశించి.. మీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుంది… ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారు… చక్కగా మాట్లాడతారు. మంచి కళాభిమాని కూడా అంటూ విశ్వనాథ్ … సీఎంతో అన్నారు. సాహిత్యాభిలాష ఎలా పుట్టిందని విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు, చిన్నప్పటి నుంచి తన గురువులతో ఉన్న సాంగత్యం గురించి కేసీఆర్ వివరించారు.

హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనీ… ప్రభుత్వం కూడా త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుంది అని కేసీఆర్… విశ్వనాథ్ తో అన్నారు.