‘కేసీఆర్​ సార్​.. మా కాలనీ గోస చూడు’

‘కేసీఆర్​ సార్​.. మా కాలనీ గోస చూడు’

మంచిర్యాల, వెలుగు:   సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ నగర్​కు వచ్చి తమ గోస చూడాలని కాలనీకి చెందిన ముంపు బాధితులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఏటా వానాకాలంలో వరదలు వచ్చి కాలనీ మునిగిపోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని తాము కట్టుబట్టలతో మిగులుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కంటితుడుపు చర్యలు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని మండిపడ్డారు. తమకు డబుల్​బెడ్రూంలు కేటాయించాలని డిమాండ్​చేశారు. ముంపు బాధితుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో నష్టపోయిన రైతులకు, వరద ముంపు బాధితులకు పరిహారం అందించడంతో పాటు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​చేశారు. నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, తుల ఆంజనేయులు పాల్గొన్నారు.