కేసీఆర్‌వన్నీ కొంపలు ముంచే ఆలోచనలే.. 

కేసీఆర్‌వన్నీ కొంపలు ముంచే ఆలోచనలే.. 
  •  
  • కేటీఆర్ బతుకేందో నాకు తెలుసు
  • కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమే
  • ఎంపీ బండి సంజయ్ కమార్

సిరిసిల్ల : అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించినోళ్లను, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసేటోళ్లను బహిష్కరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్  పిలుపునిచ్చారు.  పాదయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజలను ఉద్దేశించిఆయన  ప్రసంగించారు. కేసీఆర్ వన్నీ కొంపలు ముంచే ఆలోచనలేనని మండిపడ్డారు. కట్టె కాలే వరకు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటూనే ఉంటాడని విమర్శించారు. 

కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు అని, టిక్కెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు పోయి కేటీఆర్ అని మార్చిండని దెప్పి పొడిచారు. కేటీఆర్ బతుకేందో తనకు తెలుసని,  ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగేటోడు అని చెప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించిండు అని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులిచ్చిందని తెలిపారు.  ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని మండిపడ్డారు. పరస్పర అవగాహనతోనే ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారని చెప్పారు. కృష్ణా, కాళేశ్వరంపై విచారణ జరిపి, దోషులను జైలుకు పంపాలని డిమాండ్​ చేశారు. 

అభివృద్ధి కోసం పైసలిచ్చేది మోదీ అని  మీ కోసం కొట్లాడేది బీజేపీ అని,  కానీ కాంగ్రెస్ కు ఓటేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుడిని మింగితే.. కాంగ్రెస్ గుడిలోని లింగాన్ని సైతం మింగేసే బాపతు అని ఎద్దేవా చేశారు.  ప్రజల కోసం నిరంతరం పోరాడిన తనపై 100కుపైగా కేసులు పెట్టినా భయపడలేదన్నారు. కేటీఆర్ కు కండ కావరం తలకెక్కి మాట్లాడుతున్నడని, అయ్య పేరు చెప్పుకుని బతుకుతున్నడని మండిపడ్డారు.  తాత, తండ్రి పేరు చెప్పుకుని తాను  రాజకీయాల్లోకి రాలేదన్నారు. కార్యకర్తగా మొదలై ప్రజల కోసం కొట్లాడి ఎంపీ అయ్యానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమేనని ఆయన అన్నారు. బీజేపీకి ఓటేసి మోదీని మళ్లీ ప్రధానిని చేద్దాం అని పిలుపునిచ్చారు.