
- జాతీయ రాజకీయాలపై దేశ, విదేశీ ఆర్థిక వేత్తలతో చర్చిస్త: కేసీఆర్
- 2వేల రిటైర్డ్ సివిల్ సర్వెంట్లతో హైదరాబాద్లో సదస్సు
- పెట్రోల్, డీజిల్పై మేం వ్యాట్ పెంచలేదు.. ఎట్ల తగ్గించమంటరు
- ప్లీనరీ ముగింపు ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఇకపై మోడీ ఆటలు సాగవని సీఎం కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు 15, 20 రోజుల పాటు దేశ, విదేశీ ఆర్థిక వేత్తలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేధావులు ఈ సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. 2 వేల మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్లతో హైదరాబాద్లో సదస్సు నిర్వహించబోతున్నామన్నారు. ‘‘తెలియని విషయాలు తెలుసున్నట్టు నటించి భంగపడడం కంటే, అవసరమైన అన్ని చర్యలు తీసుకుని, దేశ రాజకీయాల్లోకి పోదాం” అని కేడర్కు పిలుపునిచ్చారు. ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ వనరులను వాడుకునే సత్తా, ఇప్పటి పాలకులకు లేనందునే ఇండియా వెనకబడి ందన్నారు.
విరాళాలు ఇస్తాం అంటున్నరు
‘‘జాతీయ రాజకీయాలకు పోవాలంటే డబ్బులు ఎట్లా అని ఎవరో మిత్రుడు అడిగారు. మా పార్టీకి నిబద్ధులైన 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో రూ.వెయ్యి నుంచి రూ.కోటి వరకూ విరాళం ఇచ్చేవారు ఉన్నారు. మేము ఒక్క పిలుపునిస్తే, తలా ఓ వెయ్యి ఇచ్చినా రూ.600 కోట్లు అవుతాయని చెప్పాను. జాతీయ రాజకీయాల్లోకి పోతున్నాం అంటే, విరాళం ఇస్తాం అని దాతలు ముందుకొస్తున్నారు’’ అని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆఫీసు నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
మోడీది డ్రామా కాన్ఫరెన్స్
సీఎంలతో ప్రధాని మోడీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్పై కేసీఆర్ మండిపడ్డారు. కరోనా గురించి కాన్ఫరెన్స్ పెట్టి, రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని చెప్పడానికి సిగ్గులేదా అంటూ దుయ్యబట్టారు. కేంద్ర పన్నులు పెంచితే, రాష్ట్రం తగ్గించాల్నా అని ప్రశ్నించారు. ‘‘ప్రజల మీద ప్రేమ ఉంటే, నువ్వు ఎందుకు పెంచుతున్నవ్? లేని సెస్సులు ఎందుకు వేస్తున్నవ్’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్పై తెలంగాణలో ఇప్పటివరకూ వ్యాట్ పెంచలేదని, పెంచకుండానే ఎట్ల తగ్గించమంటారని ప్రశ్నించారు. ‘‘డీజిల్ రేట్ల ధరలు ఇలా పెంచుతుంటే ఆర్టీసీ బతకాల్నా, చావాల్నా? ఆర్టీసీని జల్ది అమ్మేయాలి అంటున్నరు. డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయ్యి కోట్ల బహుమతి కూడా పెట్టిన్రు” అని విమర్శించారు. ‘‘మోడీకి ప్రజలు ఇచ్చిన పదేండ్లలో 8 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ 8 ఏండ్లలో మోడీ చేసిందేంది? రోజూ ప్రసంగాల హోరు.. అబద్ధాల జోరు తప్పితే ఇంకేమీ లేదు” అని దుయ్యబట్టారు. ‘‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా విద్వేషం, విష ప్రచారం ఎందుకు? శోభాయాత్రలు, కత్తులు, కఠారాల ప్రదర్శనలు ఎందుకు? ఆటవిక మృగాల్లాగా కత్తులు పట్టుకొని రోడ్ల మీద ఊరేగుతరా? దీన్ని నాగరిక సమాజం కోరుకుంటదా? ’’ అని అన్నారు.
90 సీట్లలో గెలుస్తం
రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు అని కేసీఆర్ అన్నారు. ‘‘ప్రజలు సునిశితంగా అన్ని విషయాలు గమనిస్తుంటారు. ఎవడో వాగితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో మనమే గెలుస్తం. ఈ విషయంలో అనుమానమే లేదు. అయితే, మనమే గొప్ప అని విర్రవీగకూడదు. అందుకే కన్సల్టెన్సీ సంస్థను నియమించుకున్నాం. వాళ్లు చేసిన సర్వేలో 90 పైచిలుకు స్థానాల్లో అలవోకగా గెలుస్తాం అని తేలింది’’ అని ఆయన చెప్పారు.