మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యం ప్రారంభం

మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యం ప్రారంభం

ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని మే4వ తేదీన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గురువారం (మే 4న) మ‌ధ్యాహ్నం 1:05 గంట‌ల‌కు బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యాన్ని కేసీఆర్  ప్రారంభించ‌నున్నారు. 

గురువారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు వ‌సంత్ విహార్‌లోని బీఆర్ఎస్ ఆఫీసుకు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. హోమం, యాగం, వాస్తు పూజ‌ల్లో పాల్గొన‌నున్నారు. అనంత‌రం పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ గంట పాటు సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. 

ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యస‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ క‌లిసి ప్రారంభోత్సవ ఏర్పాట్లను స‌మీక్షిస్తున్నారు. పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే మంత్రులు, బీఆర్ఎస్ నాయ‌కులు, ప‌లు కార్పొరేష‌న్ల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్య నాయకులు కూడా వెళ్తున్నారు. 

మరోవైపు.. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ఢిల్లీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలో తీసుకున్న భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.