
- పుణె మెట్రో ఫేజ్2కు రూ.3,626 కోట్లు
- ఆగ్రాలో పొటాటో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు రూ.111 కోట్లు
- కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పుణె మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ విస్తరణ పనుల కోసం రూ.3,626 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ఇంటర్నేషనల్పొటాటో సెంటర్ (సీఐపీ) ఆధ్వర్యంలో దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.
అనంతరం కేబినెట్నిర్ణయాలను సెంట్రల్మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్మీడియాకు వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్సర్కారు విధించిన ఎమర్జెన్సీకి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నాటి బాధితులకు కేబినెట్నివాళిగా 2 నిమిషాల పాటు మౌనం పాటించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఏడాదితో సంవిధాన్ హత్యా దివస్కు 50 ఏళ్లు పూర్తైందని పేర్కొన్నది. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి యుగమని తీర్మానంలో వెల్లడించింది.
శుభాంశు శుక్లాకు అభినందన
భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో కూడిన బృందం ఇంటర్నేషనల్స్పేస్స్టేషన్కు ఆక్సియం-4 మిషన్లో విజయవంతంగా బయలుదేరడాన్ని కేంద్ర కేబినెట్ స్వాగతించింది. ఈమేరకు వారిని అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. 140 కోట్ల భారతీయుల ఆశయాలను శుభాంశు శుక్లా మోసుకెళ్లారని తెలిపింది. శుభాంశుతో పాటు ఇతర ఆస్ట్రోనాట్లకు కేబినెట్అభినందనలు తెలిపింది. ‘‘భారత్, హంగేరీ, పోలెండ్, యూఎస్ నుంచి ఆస్ట్రోనాట్లతో కూడిన అంతరిక్ష మిషన్ను విజయవంతంగా ప్రయోగించడాన్ని మేం స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొన్నది.
కేబినెట్ నిర్ణయాలివే..
12.75 కిలో మీటర్ల పొడవున రెండు ఎలివేటెడ్ కారిడార్లతో కూడిన పుణె మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్–2కు దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ను రూ.3,626 కోట్లతో నిర్మించనున్నారు.ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్లు 13 స్టేషన్లను కలిగి ఉంటాయని, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలైన చందాని చౌక్, బావ్దాన్, కోత్రుడ్, ఖరడి, వాఘోలిని కలుపుతాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నాలుగేండ్లలోపు
పూర్తవుతుందని వెల్లడించారు.
ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ ఆధ్వర్యంలో దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని యూపీలోని ఆగ్రాలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.111.5 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ కేంద్రం ద్వారా బంగాళాదుంపలు, చిలగడ దుంపల ప్రొడక్షన్ను పెంచి, రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా చేయడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
జార్ఖండ్లోని ఝరియా బొగ్గు గనుల ప్రాంత నిర్వాసిత కుటుంబాల పునరావాసం కోసం రూపొందించిన ‘‘ఝరియా మాస్టర్ ప్లాన్”కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.5,940 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో నిర్వాసిత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం, వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, స్థిరమైన జీవనోపాధి మార్గాలను చూపించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.