
భువనేశ్వర్: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవలే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు మరణంతో తగిలిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోక ముందే.. తాజాగా కమ్యూనిస్టులకు మరో ఊహించని షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్ వాంటెడ్ కమ్యూనిస్ట్ హిడ్మా ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
గురువారం (మే 29) ఒడిషాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటగుడ అటవీ ప్రాంతంలో హిడ్మాను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. హిడ్మా అరెస్ట్ సందర్భంగా AK-47 రైఫిల్తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రి, ఇతర కీలకమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. హిడ్మా అరెస్ట్ ను భద్రత దళాలు ఇంకా ధృవీకరించలేదు.
దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్గా ఉన్నాడు.
కాగా, ఛత్తీస్గడ్ దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన ఆదివాసి హిడ్మా.. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం మావోయిస్టు పార్టీలో చేరాడు. బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. మావోయిస్టు ఆపరేషన్లలో ఆరితేరిన హిడ్మా.. దాడులకు వ్యూహలు రూపొందించడంలో దిట్టగా పేరొందాడు.
కూబింగ్, CRPF క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పార్టీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం హిద్మా పరిధిలోనే ఉంటుంది. హిడ్మా దళంలోనే దాదాపు 180 నుంచి 250 మంది నక్సల్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రతా దళాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రత్యేకంగా ఓ టీంను ఏర్పాటు చేశారు. టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులకు పాల్పడుతుంటుంది. వీరి ప్రధాన లక్ష్యం కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే బలగాలను అంతమొందించడమే. దీనివల్ల తమ ఇలాఖాలోకి బలగాలు అడుగుపెట్టకుండా ఉండడమే లక్ష్యంగా టీంను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
దండాకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంఛార్జీగా కూడా హిడ్మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. హిడ్మాపై 50 లక్షల రూపాయల రివార్డు ఉందని, వందల సంఖ్యలో ఘటనలకు హిడ్మా కారణమని పోలీసులు చెప్తున్నారు. దండకారణ్యంపై పూర్తి స్థాయి పట్టున్న హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల కర్రెగుట్టలో భద్రతా దళాలు నిర్వహించిన భారీ అపరేషన్ కూడా హిడ్మా లక్ష్యంగానే జరిగింది. కానీ తన తెలివితో హిడ్మా కర్రెగుట్టల నుంచి సేఫ్గా తప్పించుకున్నాడు.
అయినప్పటికీ ఎంతో మంది జవాన్ల ప్రాణాలు పోవడానికి కారకుడైన హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా భద్రతా దళాలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎట్టకేలకు గురువారం (మే 29) ఒడిషాలో హిడ్మాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటవలే మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాలను ఎన్ కౌంటర్ చేసిన భద్రతా దళాలకు.. మరో అగ్రనేత హిడ్మా చిక్కడం భారీ విజయమనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.