విపత్తు లో నష్టాల నివారణకు పటిష్ట చర్యలు : ముజమ్మిల్​ఖాన్​

విపత్తు లో నష్టాల నివారణకు పటిష్ట చర్యలు : ముజమ్మిల్​ఖాన్​
  • ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్​ఖాన్​

ఖమ్మం టౌన్, వెలుగు  : విపత్తు సమయంలో నష్టాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో విపత్తుల నిర్వహణపై ఏర్పాటు చేసిన జిల్లా డిజాస్టర్ మేనేజ్​మెంట్ సమావేశంలో సీపీ సునీల్ దత్, అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి ఆయన మాట్లాడారు. గతేడాది వరదలతో ఎఫెక్ట్​ అయిన ప్రాంతాలను ఎంపీడీవోలు మండలాల వారీగా, పట్టణాలు, నగరాలలో మున్సిపల్ కమిషనర్లు గుర్తించి అక్కడి పరిస్థితులపై రిపోర్ట్ అందించాలన్నారు.

 జూన్ 15 నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో కురిసే వర్షం వివరాలను కూడా  ట్రాక్ చేస్తూ, నదీ ప్రవాహాల వివరాలను వాట్సప్ గ్రూపుల ద్వారా జిల్లా అధికారులకు అందిస్తామని చెప్పారు. జిల్లాలో 300 మంది ఆపద మిత్రలకు విపత్తు నిర్వహణ కోసం 12 రోజుల పాటు శిక్షణ అందించామన్నారు. అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించాలని, శుక్రవారం గ్రామాల్లో పర్యటించి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, ఒంటరి మహిళలు, వృద్ధులు, వివిధ బలహీన వర్గాల ప్రజలు ఉన్న లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు.  ప్రతి గ్రామంలో ఆపద సమయంలో ఏర్పాటు చేయాల్సిన రిలీఫ్ సెంటర్ ను ముందుగానే గుర్తించి, అక్కడ అన్ని సౌకర్యాలు క్పలించాలన్నారు. 

ప్రతీ పట్టణ పరిధిలో మున్సిపాలిటీలు బోటు, ఇతర సేఫ్టీ పరికరాలు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. చెరువులకు అవసరమైన రిపేర్లు వెంటనే చేపట్టాలన్నారు. కలెక్టరేట్ లో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ పని చేయాలని, 1077 నెంబర్ కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల సంరక్షణకు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేస్తారన్నారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ నగరంలో  12 డివిజన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి అక్కడ నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు.   ప్రతీ వార్డు లో 20 మంది వాలంటీర్లను గుర్తించి విపత్తు నిర్వహణ శిక్షణ అందించామని చెప్పారు. 

అడిషనల్​  కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ గురువారం మండల, మున్సిపాలిటీ స్థాయిలో నిర్వహించే సమావేశంలో వల్నరబుల్ గ్రామాల సంఖ్య ఆధారంగా అవసరమైన లైఫ్ జాకెట్ వివరాలు, ప్రతీ మండలంలో ఏర్పాటు చేసే రిలీఫ్ సెంటర్ జాబితా వివరాలను అందించాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వల్నరబుల్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ , జడ్పీ సీఈవో దీక్షా రైనా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం  ఏఎస్ఐ మద్దిలేటి, హెడ్ కానిస్టేబుల్స్ జగదీశ్, సురేశ్​ కుమార్, కానిస్టేబుల్స్ రియాజుద్దీన్ , కె.జనార్ధన్ పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుల్లో 3,153 దరఖాస్తుల స్వీకరణ 

ఖమ్మం కార్పొరేషన్​: ఖమ్మం జిల్లాలో 19 మండలాల పరిధిలోని 37 గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన  రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి భూ సమస్యలపై 3,153 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం ముందస్తుగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, బోనకల్ మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇప్పడు ఈ నెల 3 నుంచి 20 వరకు జిల్లాలోని మిగిలిన 19 మండలాల్లోని భూ సమస్యలపై దరఖాస్తుల 
స్వీకరిస్తున్నట్లు తెలిపారు.