అమెరికాలో భారతీయుల కిడ్నాప్ కథ విషాదాంతం

 అమెరికాలో భారతీయుల కిడ్నాప్ కథ విషాదాంతం

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల కథ విషాదాంతమైంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ నగరంలో కిడ్నాప్ కు గురైన 8 నెలల చిన్నారి సహా భారత సంతతికి చెందిన నలుగురు సభ్యులు ఓ తోటలో విగతజీవులుగా కనిపించారు. మెర్సిడ్ కౌంటీ లోని ఓ పండ్ల తోటలో మృతదేహాలు కనిపించాయని పోలీసు ఉన్నతాధికారి వెర్న్ వార్క్నే తెలిపారు.

ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి  సోమవారం 8 నెలల చిన్నారి అరహిధేరి, ఆమె తల్లి జస్లీన్ కౌర్ (27),తండ్రి జస్దీప్ సింగ్ (36), మేనమామను దుండగులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యుల్లో ఒకరికి చెందిన కారును కాల్చివేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బాధితుడి బ్యాంకు కార్డులలో ఒకటి మెర్సిడ్ కౌంటీలోని అట్ వాటర్ ఏరియాలోని ఒక ఏటీఎం సెంటర్ లో ఉపయోగించినట్లు వెల్లడైంది.  

కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయుల డెబిట్ కార్డులతో డబ్బు డ్రా చేసేందుకు వారిని ఏటీఎం సెంటర్ వద్ద దుండగులు నిలబెట్టిన దృశ్యం (సీసీ కెమెరా ఫుటేజీ)    

దీనికి సంబంధించి ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు. జస్దీప్ తల్లిదండ్రులు డాక్టర్ రణధీర్ సింగ్, కిర్పాల్ కౌర్ హోషియార్‌పూర్ తాండా బ్లాక్‌లోని హర్సి పిండ్ గ్రామానికి చెందినవారు.కొడుకు, కోడలు, మనవరాలి మరణవార్త విని రణధీర్ సింగ్ బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు జీసస్ మాన్యువల్ సల్గాడోను పోలీసులు అరెస్ట్ చేశారు.