
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెంచుకున్న భారత్.. దాయాది దేశంతో క్రికెట్ ఆడేందుకు మాత్రం అనుమతి ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని సాధారణ ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. ఇండియా, పాక్ మ్యాచ్ రోజు అయితే సోషల్ మీడియాలో బాయ్కాట్ ఇండియా, పాక్ మ్యాచ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.
అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా పాక్తో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ క్రమంలో ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి గల కారణాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. సోమవారం (సెప్టెంబర్ 15) ముంబైలో కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్తో విడిగా ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదని.. కేవలం ఆసియా కప్, ఐసీసీ టోర్నీల వంటి బహుపాక్షిక టోర్నమెంట్లో మాత్రమే ఆడుతోందని క్లారిటీ ఇచ్చారు.
►ALSO READ | Asia Cup 2025: హాంకాంగ్కు డూ ఆర్ డై.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో కూడా పాకిస్థాన్తో ఆడొద్దనుకుంటే ఇండియా టోర్నీ నుంచి మొత్తమే తప్పుకోవాల్సి ఉంటుందని.. ఓవరాల్గా ఆ నిర్ణయం ఇండియాకే నష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్లో కూడా పాక్తో ఆడకపోతే ఇండియా టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఫలితంగా మనమే బాధపడాల్సి ఉంటుందన్నారు.
ఒక దేశంతో మనకున్న శత్రుత్వం కారణంగా మనం ఐసీసీ వరల్డ్ కప్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్కు వెళ్లకపోతే చివరకు ఎవరు నష్టపోతారని ప్రశ్నించారు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. సెంటిమెంట్ ఉండటం కరెక్టే.. కానీ సెంటిమెంట్ వెనుక ఒక హేతుబద్ధమైన ఆలోచన ఉండాలని పేర్కొన్నారు.