
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై సీఎం జగన్ వాఖ్యలను ఖండిస్తున్నామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. జగన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మాతృ భాషలోనే బోధన ఉండి తీరాలన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ అంశాలు అమలు కావాల్సి ఉందో కేంద్రానికి తెలియజేయాలని ఇరు రాష్ట్ర సీఎస్ లకు లేఖ రాశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలపై కేంద్రానికి తెలియజేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి.
2020 లో జరిగే నో మనీ ఫర్ టెర్రర్ సదస్సుకు ఇండియా అతిధ్యం ఇస్తుందన్నారు. దేశంలో బలమైన ప్రధానులు చేయలేని పనులు బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం ఒకే రాజ్యాంగం నినాదం ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది మోదీ దేశ పురోగతికి అడుగులు వేశారన్నారు. రామజన్మ భూమి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకు తెలియజేసి సమస్య పరిష్కారానికి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది బీజేపీనే అని అన్నారు.