అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో సభలు : కిషన్ రెడ్డి

అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో సభలు : కిషన్ రెడ్డి
  • కేటీఆర్ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని ఫైర్
  • నిజామాబాద్​లో ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్, వెలుగు : అక్టోబర్​1న పాలమూరు, 3న ఇందూరులో ప్రధాని మోదీ సభలు ఉంటాయని.. ఆ సభలతోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడ్తామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల విద్యుత్ ​ప్రాజెక్టును నిజామాబాద్ సభలో మోదీ వర్చువల్​గా ప్రారంభిస్తామని చెప్పారు. నిజామాబాద్​లోని గవర్నమెంట్​(గిరిరాజ్)​ డిగ్రీ కాలేజీ వద్ద ప్రధాని సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 

ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్​నుంచి ఆదిలాబాద్​దాకా పార్టీ బలంగా ఉంది. బలహీనంగా ఉన్నామని భావిస్తున్న ఖమ్మంలోనూ మద్దతు పెరుగుతోంది. గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు” అని చెప్పారు. మోదీ తర్వాత కేంద్రమంత్రి అమిత్​షాతో మరికొందరు మంత్రులు, జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వస్తారని తెలిపారు.

‘‘తెలంగాణకు ఏమిచ్చారని మోదీ వస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏమైనా కేటీఆర్​జాగీరా?” అని ప్రశ్నించారు. గడిచిన తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. 

గవర్నర్ నిర్ణయం సరైనదే.. 

పాలన తెలియని దద్దమ్మల చేతితో రాష్ట్రం ఉందని కిషన్​రెడ్డి విమర్శించారు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్..​ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. ఇంట్లో కూర్చొని పనికి మాలిన ప్రశ్నలు వేస్తే, తాము ఎందుకు జవాబు చెప్తామని అన్నారు. కేసీఆర్​సేవలో తరించేవారికి, ఆయనకు కొమ్ము కాసే ఏజెంట్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తరా? అని ప్రశ్నించారు. గవర్నర్​సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

‘‘కవులు, కళాకారులు, మేధావులకు బదులు తన గుడుగుడుగుంచం గాళ్లను కేసీఆర్​ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశారు. ముమ్మాటికీ వాళ్లను తిరస్కరించాల్సిందే” అని అన్నారు. తాము ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్​ను తెలంగాణ నుంచి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్​చేశామని గుర్తు చేశారు. కాగా, సభకు జన సమీకరణపై బస్వా గార్డెన్​లో పార్టీ ఆఫీస్​ బేరర్లతో నిర్వహించిన మీటింగ్​లో కిషన్ రెడ్డి, ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు.