సింగరేణి కార్మికుల సమస్యలపై బీజేపీ పోరు

సింగరేణి కార్మికుల సమస్యలపై బీజేపీ పోరు

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి . సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని.. అధికార మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఆయన సమక్షంలో INTUC, AITUC, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల సింగరేణి కార్మికులు BMSలో చేరారు. సింగరేణి కార్మికులను TRS పార్టీ ఉపయోగించుకోవడమే కాకుండా మోసం చేసిందని చెప్పారు కిషన్ రెడ్డి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కేసీఆర్ హామీలు నీటిమీద రాసిన రాతలుగానే మిగిలిపోయాయని చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర వాటా 51శాతం ఉంటే 49శాతం కేంద్రానికి వాటా ఉందని తెలిపారు. సింగరేణిని ఆదుకునే భాద్యతను కేంద్రం తీసుకుంటుందని అన్నారు. కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు చావు తప్పి కన్ను లొట్టబోయిందని.. బీజేపీ చేతిలో సీఎం కూతురే ఓడిపోయిందని అన్నారు కిషన్ రెడ్డి.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తదని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను తప్పకనెరవేరుస్తామని తెలిపారు. ఈ ఆరు సంవత్సరాలుగా కేసీఆర్ మాటలతో మభ్యపెడుతున్నారని అన్నారు.

సింగరేణి లో కారుణ్య నియామకాల కోసం పోరాడతాం: వివేక్ వెంకటస్వామి
సింగరేణి లో కారుణ్య నియామకాలు చేస్తామని  కేసీఆర్ చెప్పినా.. 25 శాతం కూడా నియామకాలు చేపట్టలేదన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. కారుణ్య నియమాకాలను టెండర్ ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టుకు అప్పగించారని విమర్శించారు. సింగరేణిలో 48 వేల మంది రిటైర్ అయ్యారని.. ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కారుణ్య నియామకాలు, ఖాళీల భర్తీ కోసం బీజేపీ పోరాడుతుందన్నారు వివేక్.