ప్రధాని మోదీ పిలుపు... కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి

ప్రధాని మోదీ పిలుపు... కనకదుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేసిన కిషన్ రెడ్డి

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో  గత 500 ఏళ్ల హిందువుల ఆకాంక్ష నెరవేరనుందన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ పిలుపు మేరకు... ఆలయాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జనవరి 17వ తేదీ బుధవారం బషీర్ బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరుగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకను హిందువులందరు విజయవంతం చేయాలని కోరారు.

 రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో 150 దేశాలలో ఉన్న హిందువులు ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఎంతోమంది బలిదానాలు చేసిన తరువాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని... హిందువుల ఆత్మగౌరవానికి సంబందించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో హిందువులు అందరూ పాల్గొనాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.