ఇందూర్ లో ఖాళీ కుర్చీలకు సన్మానం

ఇందూర్ లో ఖాళీ కుర్చీలకు సన్మానం

నిజామాబాద్, వెలుగు: కొత్తగా ఎన్నికైన మున్నూరుకాపు మున్సిపల్​ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను సన్మానించేందుకు నిజామాబాద్​ మాజీ మేయర్​ సంజయ్​ ధర్మపురి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వింత ఘటన చోటు చేసుకుంది. ప్రోగ్రాంకు బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాలేదు. దీంతో వారికి కేటాయించిన ఖాళీ కుర్చీలను సన్మానించడం ఆసక్తి రేపింది. కాంగ్రెస్​కు చెందిన సంజయ్​ మున్నూరు కాపు జిల్లా సంఘానికి ప్రెసిడెంట్​గా వ్యవహరిస్తున్నారు.

ఈక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచిన మున్నూరుకాపులను సన్మానించేందుకు ప్రగతినగర్​ మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాగా వారిని సన్మానించారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మాత్రం రాలేదు.  ఎంపీ అర్వింద్​ బీజేపీ కీలక నేత కాగా, ఆయన సోదరుడు మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ కాంగ్రెస్​ పార్టీలో ఉన్నారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విబేధాలున్నాయి.

దీంతో ఎక్కడ ఎంపీ అర్వింద్​ ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందోనని బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనిపై సంజయ్​ తన స్పీచ్​లో ఘాటుగా స్పందించారు. తన తండ్రి డి.శ్రీనివాస్​ ఆశయాల మేరకు కాపు కులస్తులను కలుపుకొని వెళ్లాలని ప్రయత్నిస్తుంటే, కొన్ని అరాచకశక్తులు అడ్డుకుంటున్నాయని ఫైర్​ అయ్యారు. కులానికి కూడా రాజకీయాలు అంట గట్టడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్​ ఆకుల సుజాత పాల్గొన్నారు.