విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్​లో తొలిసారి నిర్వహణ: కిషన్​రెడ్డి

విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్​లో తొలిసారి నిర్వహణ: కిషన్​రెడ్డి
  • సెప్టెంబర్​ 17న జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తరు
  • అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు 
  • చీఫ్ గెస్టుగా అమిత్ షా వస్తరు..ఈసారి కూడా కేసీఆర్​కు ఆహ్వానం పంపిస్తం
  • అన్ని పార్టీల నేతలు రావాలని కోరుతున్నట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన వేడుకలను ఈసారి  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్రపతిభవన్​లో జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. సెప్టెంబర్​ 17న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పిస్తారని ఆయన తెలిపారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రపతిభవన్​లో విమోచన వేడుకలు జరగడం తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకు ఎంతో సంతోషకరమైంది. ఇదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఉంటాయి. ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. పార్టీలకతీతంగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ కు సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తూ లేఖ పంపుతాం” అని చెప్పారు. గత ఏడాది కూడా సీఎం కేసీఆర్​ను వేడుకలకు ఆహ్వానించామని, కానీ రాలేదని అన్నారు. కేంద్రం నిర్వహించే ప్రోగ్రామ్ అయినందున అన్ని పార్టీల వారు కూడా హాజరుకావాలని ఆయన కోరారు. 

ఉత్సవాలపై కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, మజ్లిస్​ కుట్ర

పరేడ్​ గ్రౌండ్​లో తెలంగాణ విమోచన వేడుకలను కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, వీటిని అడ్డుకునే కుట్రకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తెరలేపాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. మజ్లిస్​తో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, మజ్లిస్​కు ఈ రెండు పార్టీలు జీ హుజూర్ అంటూ మోకరిల్లుతున్నాయని దుయ్యబట్టారు.