చేనేత వృత్తిని కాపాడుకోవడానికి కార్మికులకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన హైదరాబాద్లో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 7న చేనేతలకు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్లస్టర్లను వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు చెప్పారు. చేనేత దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ చేనేత దుస్తుల్ని ధరించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నట్టు వివరించారు.
పోచంపల్లి చీరలు అమెరికా, ఆస్ట్రేలియా,ఇజ్రాయిల్ దేశాల్లో అమ్ముతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 15 శాతం నూలు సబ్సిడీతో అందిస్తోందని చెప్పారు. దేశంలో వ్యవసాయం తరువాత చేనేత రంగం మీదనే ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్నారని కిషన్రెడ్డి వెల్లడించారు.
వరల్డ్ బెస్ట్ టూరిజం కేంద్రంగా పోచంపల్లి గుర్తింపు పొందినట్లు తెలిపారు. చేనేత సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేస్తుందని అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో, హాస్టల్ ల లో చేనేత బెడ్ షీట్ లు, బట్టలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆత్మహత్యలను నివారించాలని కోరారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.