
ప్రియాంక రెడ్డి హత్యపై దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ దారుణ ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులకు ఉరి శిక్ష పడేలా కృషి చేస్తామన్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు సానె పెట్టబోతున్నామని.. త్వరలోనే చట్టాలను మార్చబోతున్నామని తెలిపారు. క్రిమినల్ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుదే ఫైనల్ నిర్ణయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహిళల రక్షణ కోసం 112 స్పెషల్ ఆప్స్ రూపొందించామన్న ఆయన.. దీనిని దేశంలోని ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇదే విషయంపై లోక్ సభలో చర్చించనున్నట్లు తెలిపారు. IPC, CRPCలో ఎలాంటి సవరణలు చేయాలో సలహాలు కోరుతామని.. ఫోక్సో చట్టం వల్ల నిందితులకు సత్వరమే శిక్షలు పడుతున్నాయని చెప్పారు. ప్రియాంక రెడ్డి విషయంలో పోలీసులు సరిహద్దుల విషయంలో తాత్సారం చేయడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చట్టాలను మార్చబోతున్నామని తెలిపారు కిషన్ రెడ్డి.
ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత అంతటి ఘోరమైన హేయమైన ఘటన శంషాబాద్ లో జరిగిందన్నారు. నిందితులకు త్వరగా శిక్షలు పడేందుకు రాష్ట్ర పోలీసులకు సహకారం అందిస్తామని తెలిపారు. 112 యాప్ ను తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించే విషయమై DGPతో మాట్లాడానని తెలిపారు. గుజరాత్ లో రాత్రి వేళ లో సైతం మహిళలు ఒంటరిగా తిరుగుతారు. ఆ పరిస్థితి దేశ వ్యాప్తంగా రావాలన్నారు. అప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని తెలిపారు కిషన్ రెడ్డి.