న్యూఢిల్లీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో కరోనా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోందని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రజల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని సీఎం కేసీఆర్కు ఆయన సూచించారు. కరోనా కట్టడికి కేంద్రం జారీ చేసిన గైడ్లైన్స్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా ఇంటింటి సర్వే చేపట్టి, సకాలంలో పేషెంట్లను గుర్తించాలని సీఎం కేసీఆర్కు కిషన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నదని, అయినప్పటికీ తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని లేఖలో ఆయన పేర్కొన్నారు. సకాలంలో పేషెంట్లను గుర్తించి, మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సూచించారు. ఎక్కువ ముప్పు ఉన్న వృద్ధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్న వారిని తొలిదశలో గుర్తించి ట్రీట్మెంట్ అందిచడం వల్ల మరణాలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు ప్రజలకు ఇతర అత్యవసర వైద్యసేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. నమూనా టెస్టుల రిజల్ట్స్ త్వరగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లోకల్ హాస్పిటల్స్ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బందికి హెల్ప్గా ఉండేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లు ఏర్పాటు చేయాలని కోరారు.
లాక్డౌన్ స్పిరిట్ కొనసాగించాలి
దేశవ్యాప్తంగా ఎక్కువగా వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాలు, 45 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని, ఇందులో హైదరాబాద్ పేరు కూడా ఉండటం ఆందోళనకరమన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుధాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. కాన్ఫరెన్స్లో రాష్ట్ర వైద్యశాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారని, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారని పేర్కొన్నారు. ఆ చర్యలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కిషన్రెడ్డి కోరారు. సడలింపులు ఇచ్చినా లాక్డౌన్ స్పిరిట్ కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.