
సీజన్తో పనిలేకుండా అప్పటికప్పుడు ఈజీ, హెల్దీ, టేస్టీగా చేసుకునే శ్నాక్ ఏదైనా ఉందంటే పుట్టగొడుగులే. చాలా తక్కువ టైంలో రుచికరంగా తినగలిగే వెరైటీలు మష్రూమ్స్తోనే సాధ్యమేమో!
పెప్పర్ మష్రూమ్
కావాల్సినవి :
మష్రూమ్లు – రెండు కప్పులు
నూనె, వెన్న – ఒక్కో టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డలు – రెండు
క్యాప్సికమ్ – ఒకటి
వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – అర టీస్పూన్
వెనిగర్, సోయాసాస్ – ఒక్కో టీస్పూన్
కశ్మీరీ కారం – పావు టీస్పూన్
కొత్తిమీర – కొంచెం
తయారీ :
పాన్లో నూనె, వెన్న వేడి చేసి అందులో ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. అవి వేగాక అందులో మష్రూమ్లు వేసి వేగించాలి. తర్వాత వెల్లుల్లి తరుగు, పెద్దగా కట్ చేసిన ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. కాసేపు వేగిన తర్వాత ఉప్పు వేసి కలపాలి. ఆపై మిరియాల పొడి, వెనిగర్, సోయాసాస్, కశ్మీరీ కారం, కొత్తిమీర వేసి కలపాలి. ఈ ఫ్రైని వేడి వేడిగా తింటే టేస్ట్ బాగుంటుంది.
టిక్కీ
కావాల్సినవి :
పుట్టగొడుగులు – ఒక కప్పు
నూనె, అల్లం – ఒక్కో టీస్పూన్
పచ్చిమిర్చి, నల్ల యాలక – ఒక్కోటి
ఆలుగడ్డలు (ఉడికించి) – మూడు
ఉప్పు – సరిపడా, పసుపు, గరం మసాలా,
ధనియాల పొడి – ఒక్కోటి అర టీస్పూన్
కార్న్ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, చాట్ మసాలా – కొంచెం
తయారీ :
పాన్లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన పుట్టగొడుగులు వేసి వేగించాలి. అవి కాస్త వేగాక, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డల్ని వేసి మెదపాలి. అందులో పసుపు, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. వాటితోపాటు వేగించిన మష్రూమ్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. నల్ల యాలక దంచి,
ఆ పొడిని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమానికి స్మోక్ ఫ్లేవర్ ఇవ్వాలనుకుంటే బొగ్గును కాల్చి ఒక చిన్న గిన్నెలో వేసి దాన్ని ఈ మిశ్రమం మధ్యలో పెట్టి గిన్నెపై మూతపెట్టాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఉండలు చేసి, టిక్కీల్లా వత్తాలి. ఆపై ఆ టిక్కీలను కార్న్ఫ్లోర్లో దొర్లించాలి. అలా చేసిన వాటిని పాన్లో వేగించాలి. రెండు వైపులా కాల్చాలి.
కబాబ్
కావాల్సినవి :
మష్రూమ్స్ – ఒక కప్పు,ఉప్పు – సరిపడా
పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒక్కో టీస్పూన్
మొజరెల్లా చీజ్, స్వీట్ కార్న్ (ఉడికించి) – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, పెరుగు లేదా యోగర్ట్ – ఒక కప్పు
గరం మసాలా, మిరియాల పొడి – అరటీస్పూన్ చొప్పున
పచ్చిమిర్చి – ఒకటి, శనగపిండి, నిమ్మరసం – ఒక్కో టేబుల్ స్పూన్
కసూరీ మేథి– పావు టీస్పూన్
కశ్మీరీ కారం, కొత్తిమీర – కొంచెం
తయారీ :
పుట్టగొడుగుల్ని తొడిమలు వేరు చేసి పెట్టాలి. పాన్లో నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి అందులోనే పుట్టగొడుగులు వేయాలి. అవి ఉడికాక నీటిని వడకట్టాలి. వాటిని టిష్యూ పేపర్తో తేమ లేకుండా తుడిచి ఆరబెట్టాలి. ఒక గిన్నెలో పెరుగు, చీజ్, స్వీట్కార్న్ ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున వేయాలి. వాటితోపాటు పచ్చిమిర్చి తరుగు, కసూరీ మేథి, ఉప్పు వేసి అవన్నీ కలిసేలా బాగా కలపాలి. ఆ తర్వాత ఆరబెట్టిన పుట్టగొడుగుల్లో ఈ స్టఫింగ్ పెట్టి మరొకటి పెట్టాలి. అంటే రెండు పుట్టగొడుగుల మధ్యలో స్టఫింగ్ ఉంటుందన్నమాట. వాటిని ఒక కడ్డీకి గుచ్చాలి.
మరో గిన్నెలో మిగిలిన పెరుగు, శనగపిండి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి అవన్నీ బాగా కలిసేలా కలపాలి. నిమ్మరసం చల్లి మరోసారి కలపాలి. అందులో చీజ్ వేసి కలపాలి.
ఆ మిశ్రమాన్ని కడ్డీలకు గుచ్చిన పుట్టగొడుగులకు పట్టించాలి. ఆ తర్వాత వాటిని సన్నని మంట మీద కాసేపు కాల్చాలి. అంతే.. నోరూరించే మష్రూమ్ కబాబ్ రెడీ.