కాంగ్రెస్ నెల రోజుల పాలన బాగుందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. రాష్ట్రంలో మార్పు వచ్చినట్లు ఢిల్లీ పాలనలో మార్పు రావాలన్నారు. సీఎం రేవంత్ పద్ధతి బాగుందన్నారు. జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అన్ని అంశాలపై సమీక్షలు చేస్తూ మార్పు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ ప్రగతి భవన్ ముందు గేట్లు బద్దలు కొట్టినప్పుడు సంతోషం కలిగిందన్నారు.రేవంత్ ప్రవర్తన సామాన్య జనాలకు నచ్చుతుందన్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులున్నీ ఎత్తివేయాలన్నారు కోదండరాం. నామినేటెడ్ పోస్టులు తమ పార్టీకి కూడా కేటాయించాలన్నారు. వాట్సప్ కాల్స్ ఆపేసి స్వేచ్ఛగా నార్మల్ కాల్స్ మాట్లాడుకునే స్థితి వచ్చిందన్నారు కోదండరాం. ప్రాణం పోతున్న సందర్భంలో ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తోందన్నారు.
బీఆర్ఎస్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. భద్రాచలంలో రాములవారి గుడికి రక్షణ లేదన్నారు. భద్రాచలం భద్రతను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాజీపేటలో కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ,తెలంగాణ ఉద్యోగుల పంపిణీ చేయాలన్నారు.