మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి :  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  • రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
  • నల్గొండ కార్పొరేషన్ లో పోటీ చేసే కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన మంత్రి 

నల్గొండ అర్బన్, వెలుగు:  నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్  కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పోటీ చేసే పలువురి అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ లోని 6 వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 25, 41, 19 డివిజన్ లో నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ఫిబ్రవరిలో నల్గొండలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు.  

మున్సిపల్ కార్పొరేషన్ లోని 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది.. చేయబోయేది తానేనని మంత్రి స్పష్టం చేశారు. తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని మంత్రి అన్నారు. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చిన తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఆ పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు.

రూ. 2.200 కోట్లతో అభివృద్ధి పనులు 

నల్గొండ మున్సిపాలిటీలో రూ.2,200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని, అన్ని డివిజన్లలో సమస్యలు లేని కాలనీలుగా తీర్చిదిద్దుతానని, ఇప్పటికే కోట్లాది రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో ప్రతిరోజు తాగునీరు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందని అన్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.

ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు మహిళా సంఘాలకు కేటాయించామని పేర్కొన్నారు. . కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, కర్నాటి కరుణాకర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, గోగుల గణేష్, లోకేశ్వరి రెడ్డి, కత్తుల వెంకట్, విక్రం రెడ్డి, అన్వర్, ఎండి హఫీజ్, అజ్గర్, మేడోజు శ్రీనివాస్, జగాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.